ఎన్‌ఐఏకు కోయంబత్తూరు కారు పేలుడు కేసు

తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ దేవాలయం వద్ద జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం  ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ పేలుడులో మరణించిన నిందితుడు జమేజా ముబిన్ ఇంటి నుంచి దాదాపు 50 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎం కె  స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  కోయంబత్తూరులో కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం వద్ద ఆదివారం ఓ మారుతి 800 కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో జమేజా ముబిన్ (25) ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, ఐదుగురిని మంగళవారం అరెస్టు చేశారు.
ముబిన్ ఇంట్లో నుంచి ఓ గ్యాస్ సిలిండర్‌ను గోనె సంచీలో పెట్టి కారు వద్దకు వీరంతా కలిసి తీసుకొచ్చినట్లు గుర్తించారు. కారులోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటల్లో చిక్కుకుని ముబిన్ మరణించగా, మహమ్మద్ డల్గా, మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహమ్మద్ అనస్ ఇస్మాయిల్‌లను అరెస్టు చేశారు. వీరిపై యూఏపీఏ ప్రకారం కేసు నమోదు చేశారు. కోర్టు వీరిని 15 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది.
ఇదిలావుండగా, అణ్ణామలై మీడియాతో మాట్లాడుతూ, ఇది సాధారణ గ్యాస్ సిలిండర్ పేలుడు కాదని, ఇది ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధంగల ఉగ్రవాద దాడి అని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. 
తమిళనాడు బీజేపీ నేత నారాయణన్ తిరుపతి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, అణ్ణామలై ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఈ కేసుపై దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి తాము ఇది ఉగ్రవాద దాడి అని చెప్తూనే ఉన్నామని, తమిళనాడు పోలీసులు మాత్రం ఇది కేవలం గ్యాస్ సిలిండర్ పేలుడు మాత్రమేనని చెప్పారని పేర్కొన్నారు. 
అణ్ణామలై ఆరోపణల తర్వాతనే కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ స్పందించి, ఐదుగురు నిందితులను యూఏపీఏ క్రింద అరెస్ట్ చేసినట్లు చెప్పారని తెలిపారు. పోలీసులు చురుగ్గా పని చేయలేదు కాబట్టి ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, ముబిన్ నివసిస్తున్న ఉక్కడం ప్రాంతం చాలా సమస్యాత్మకమైనది. 1998లో వరుస బాంబు పేలుళ్ళ తర్వాత ఇది మరింత సున్నితంగా మారింది. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి, ముబిన్ ఇంట్లోనూ, అల్-ఉమ్మా సంస్థకు చెందినవారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. అల్-ఉమ్మా చీఫ్ సయ్యద్ అహ్మద్ బాషా సోదరుడు నవాబ్ ఖాన్ ఇంట్లో కూడా సోదాలు చేశారు. 1998లో జరిగిన వరుస బాంబు పేలుళ్ళకు కుట్ర పన్నినవారిలో నవాబ్ ఒకడు. ప్రస్తుతం ఇతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
నవాబ్ కుమారుడు మహమ్మద్ డల్గాను పోలీసులు విస్తృతంగా ప్రశ్నించారు. తాజా కేసులో అరెస్టయిన వారిలో డల్గా కూడా ఉన్నాడు. మరణానికి ముందు ముబిన్ పోస్ట్ చేసిన వాట్సాప్ స్టేటస్‌లో, ‘‘నా మరణ వార్త మీకు చేరితే, నా పొరపాట్లను క్షమించండి. నా లోపాలను దాచిపెట్టండి. నా జనసలో పాలుపంచుకోండి. నా కోసం ప్రార్థించండి’’ అని ఉందని పోలీసులు తెలిపారు.
 వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న చేతిరాత పత్రాల్లో వీరు కొన్ని చోట్ల రెక్కీ నిర్వహించినట్లు ఉందని పోలీసులు తెలిపారు. రేస్ కోర్స్, విక్టోరియా హాల్, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. అల్-ఉమ్మా వ్యవస్థాపక అధ్యక్షుడు, 1998నాటి పేలుళ్ళ కేసులో మొదటి నిందితుడు సయ్యద్ అహ్మద్ బాషాకు జీవిత ఖైదు విధిస్తూ 2003లో తీర్పు వెలువడింది.
నవాబ్ ఖాన్‌కు జీవిత ఖైదు, 27 ఏళ్ళ కఠిన కారాగారవాస శిక్ష విధించారు. కోయంబత్తూరులోని ఆర్ఎస్ పురంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ ఎన్నికల ప్రచారంపై దాడి చేయాలనుకున్నారు, కానీ ఆయన విమానం ఆలస్యమవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఇతర ప్రాంతాల్లో కార్లు, బైక్‌లు, టీ క్యాన్లు, బ్యాగుల్లో పెట్టిన బాంబులు పేలడంతో కోయంబత్తూరు అంతటా భయానక వాతావరణం ఏర్పడింది. అద్వానీ లక్ష్యంగా జరిగిన ఈ దాడులకు ఈ దోషులు ‘‘ఆపరేషన్ అల్లాహు అక్బర్’’ అని పేరు పెట్టుకున్నారు.