500 రోజుల్లో మునుగోడు సమగ్రంగా అభివృద్ధి

మునుగోడు అభివృద్ధి కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసం తీసుకునే చర్యలను వివరిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. 500 రోజుల్లో మునుగోడును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కేంద్రం పెద్దలతో మాట్లాడే ఈ హామీలు ఇస్తున్నట్లు చెప్పారు.
 
తెలంగాణకు బీజేపీయే శ్రీరామ రక్ష అన్న ఆయన రాష్ట్రం బాగుపడాలంటే తమ వల్లే సాధ్యమని చెప్పారు. కనీసం రోడ్లు వేయిద్దామన్నా, కాంట్రాక్టర్లు టెండర్లు వేసే పరిస్థితి లేదని రాజగోపాల్ వాపోయారు.  నియోజకవర్గంలో రూ.200 కోట్లతో రోడ్లు వేయిస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు నితిన్ గడ్కరీ అంగీకరించినట్లు చెప్పారు.
చేనేత కార్మికులకు టెక్స్ టైల్ పార్కు, చౌటుప్పల్ లో రూ. 25 కోట్లతో ఐటీఐ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న మునుగోడులో సమస్య పరిష్కారానికి ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మర్రిగూడలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
రూ.100 కోట్లతో మూసీ నీళ్లను చౌటుప్పల్ లోని గ్రామాలకు ఎత్తి పోసే పథకాన్ని తీసుకొస్తామని రాజగోపాల్  స్పష్టం చేశారు.  నిరుద్యోగుల కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కోమటిరెడ్డి  ప్రకటించారు. నిరుద్యోగులకు జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు వీధి వ్యాపారులకు రూ.10 వేల సాయం అందిస్తామని చెప్పారు.
చౌటుప్పల్లో ఈఎస్ఐ హాస్పిటల్ తో పాటు రూ. 100 కోట్లతో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమృత్ సరోవర్ పథకం కింద వాటర్ ట్యాంకులు నిర్మించి తాగునీటి కష్టాలు దూరం చేస్తానని మాట ఇచ్చారు.
ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అధికార ప్రతినిధి  సంబిత్ పాత్ర సీఈసీ దృష్టికి తెచ్చారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో నకిలీ ఓట్లను తొలగించాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. ఇప్పటికి 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని, మరో 14 వేల నకిలీ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని కూడా తొలగించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వాహనాలను సైతం ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. తమ ఫిర్యాదు స్వీకరించి టీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.