నిజాముద్దీన్‌ దర్గాలో చాదర్‌ కప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేశ్ కుమార్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జాతీయ కార్యకారిణీ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ శనివారం రాత్రి ఢిల్లీ శివారులోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించారు. దర్గాలో చాదర్, పూలు సమర్పించి మట్టి దీపాలు వెలిగించారు. నిజాముద్దీన్ దర్గాలో మట్టి దీపాలు వెలిగించడం వల్ల శాంతి, సౌభాగ్యం, సామరస్య సందేశం వెల్లివిరుస్తుందని ఇంద్రేష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.   
 
అన్ని మతాలను గౌరవించడం తప్పనిసరి అని చెప్పిన ఆయన దీపావళి పండుగకు ఒకరోజు ముందు దర్గాను సందర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్ డా, మోహన్‌ భగవత్‌ తో కలసి ఇటీవల ఢిల్లీలోని మసీదును సందర్శించిన తర్వాత, ఇప్పుడు దీపావళి పర్వదినం సమయంలో దర్గాకు రావడం ప్రాముఖ్యత సంతరించుకున్నది.
ఆర్‌ఎస్‌ఎస్‌లోని రాష్ట్రీయ ముస్లిం మంచ్‌కు పోషకుడిగా ఇంద్రేష్‌ కుమార్‌ వ్యవహరిస్తున్నారు. డా. మోహన్ భగవత్ తో కలసి గత నెల 22న ఢిల్లీలోని మసీదుకు వెళ్లారు. అక్కడ ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో భేటీ అయ్యారు.

ఎవరూ బలవంతంగా మతం మార్చుకోవద్దని, హింసకు పాల్పడవద్దని ఇంద్రేష్‌ కుమార్‌ ఈ సందర్భంగా సూచింఛారు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని, కులాన్ని గౌరవిస్తూనే, ఇతరుల కులాన్ని, మతాన్ని గౌరవించడం ద్వారా సమాజంలో సామరస్యత వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. ఇతరుల మతాన్ని విమర్శించడం లేదా అవమానించడం గానీ చేయకూడదని స్పష్టం చేశారు.

దేశంలో అన్ని మతాలను గౌరవించినప్పుడే దేశం శుక్రవారం రాళ్లు రువ్వే మతోన్మాదుల నుంచి విముక్తి పొందుతుందని చెప్పారు. ప్రపంచంలో అన్ని మతాలను గౌరవించెడిది, ఆమోదించెడిది భారత దేశం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అన్ని పండగలు మనకు మతోన్మాదం, దురుద్దేశం, ద్వేషం, అల్లర్లు, యుద్ధం వంటివి వద్దని నేర్పుతాయని తెలిపారు. తాము శాంతి, సామరస్యం, సోదరభావాన్ని కోరుకుంటున్నామని చెప్పారు.

“భారతదేశంతో సహా ప్రపంచంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇది ప్రతి ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఈ పండుగ అన్ని మతపరమైన విభేదాలు, ప్రాంతాల మధ్య విభేదాలను తొలగిస్తుంది. భారతదేశం తీర్థయాత్రలు, పండుగలు, జాతరల దేశం. వారు పేదలకు రొట్టెలు ఇస్తారు, వారి మధ్య సోదరభావాన్ని పెంచుతారు” అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.