విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌3

అంతరిక్ష ప్రయోగాలలో మరో ఘన విజయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సొంతం చేసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన  తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పూర్తి వాణిజ్య ప్రరంగా ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌3 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైనది.
శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు జీఎస్‌ఎల్వీ-మార్క్‌ 3 (దీనినే ఎల్వీఎం3-ఎం2 అని పిలుస్తున్నారు) రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ బాహుబలి రాకెట్‌ విదేశాలకు చెందిన 36 ఉపగ్రహాలను సక్సెస్‌ఫుల్‌గా నిర్దేశి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం 19 నిమిషాల్లోనే ముగిసింది.
ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం గమనార్హం.
ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌తో పాటు శాస్త్రవేత్తలు, దేశ ప్రజల జయజయ ధ్వానాల నడుమ జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.
ఎన్నో రాకెట్‌ ప్రయోగాలను చేపట్టి భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంతో పాటు అగ్రరాజ్యాలకు ధీటుగా ప్రయోగాలను చేస్తున్న ఇస్రో మరో అడుగు ముందుకు వేసింది. తొలిసారిగా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 రాకెట్‌ను పూర్తి వాణిజ్య పరంగా వినియోగించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
 ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ ప్రయోగం మరింత ఉత్సాహాన్ని నింపింది.. 605 కిలోమీటర్లు చేరిన రాకెట్‌ యుకెకు చెందిన 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా కక్ష్యలలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌, శాస్త్రవేత్తలు షార్‌లో సంబరాలు చేసుకున్నారు..
ప్రైవేట్‌ శాటి‌లైట్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ కంపెనీ అయిన వన్‌‌వె‌బ్‌కి చెందిన 36 బ్రాడ్‌‌బ్యాండ్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ ఉపగ్రహాలను ఈ రాకెట్‌ ద్వారా నిగిలోకి పంపించారు. యూకేకి చెందిన ఈ ఉపగ్రహాలన్నీ కలిపి 5,200 కిలోల వరకు బరువు ఉంటాయి. ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించడంతో యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్‌ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా సరికొత్త ప్రయోగాలకు నాంది పలుకుతూ ఘన విజయాలను సాధిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన జీఎస్‌ఎల్‌శీ -మార్క్‌3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయ్యింది.
షార్‌లోని రెండవ ప్రయోగ వేదికపై నింగికెక్కుపెట్టిన బాణంలా ఉన్న జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 రాకెట్‌ 24 గంటల కౌంట్‌టౌన్‌ శనివారం అర్థరాత్రి 12.07గంటలకు 0కు చేరుకున్న వెంటనే నారింజ రంగు నిప్పులు చిమ్ముకుంటూ గగనతలం వైపు దూసుకెళ్లింది. రాకెట్‌లోని మూడు దశలలో ఒక్కో దశ విడిపోతూ అగ్ర భాగంలో ఉన్న ఉపగ్రహాలను ముందుకు తీసుకువెళ్లాయి.
భూమికి 605 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 అగ్రభాగాన అమర్చి ఉన్న 5200 కిలోల యుకెకు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ఒక్కొక్కటిగా ప్రవేశపెట్టింది. నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలను చేరవేయడంతో ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది.
ఓ వైపు స్వదేశీ అవసరాల కోసం పనిచేస్తూనే మరోవైపు వాణిజ్య పరంగా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జించేందుకు ఇస్రో తన ప్రయణాన్ని నిర్ధేశించుకుంది. ఈ క్రమంలో న్యూస్పేస్‌ ఇండియా, డీఓఎస్‌ సంస్థలు యుకెకు చెందిన వన్‌వెబ్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 36 ఉపగ్రహాలను మొదటగా నింగిలోకి ప్రవేశపెట్టే విధంగా వాణిజ్య పరమైన ఒప్పందంతో చేపట్టిన ప్రయోగం విజయవంతం అయ్యింది.
జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించడంతో షార్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాధ్‌ రాకెట్‌ విజయవంతం అయిన అనంతరం  జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో పాటు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగిందని ప్రకటించారు. ప్రయోగం విజయవంతానికి కృషిచేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.