ప్రజల బతుకులు మారాలంటే కేసీఆర్ ను గద్దె దింపాలి 

ప్రజల బతుకులు మారాలంటే సీఎం కేసీఆర్​ను గద్దె దింపాలని, టీఆర్ఎస్​ను బొంద పెట్టాలని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, బిల్డింగులకు నిధులు కావాలని అసెంబ్లీ సాక్షిగా ఎన్నిసార్లు అడిగినా కేసీఆర్​ పట్టించుకోలేదని మండిపడ్డారు.
‘‘కేసీఆర్‌‌ ఎప్పుడూ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప రాష్ట్రంలో మరో నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. టీఆర్ఎస్​లో ఎమ్మెల్యేలు, ఎంపీలను జీతగాళ్లలాగా, బానిసలుగా చేసుకున్నడు. ధైర్యంగా కేసీఆర్ ను అడిగే దమ్ము, ధైర్యం వారెవరికీ లేదు” అని విమర్శించారు.  ‘‘హుజూరాబాద్ లాగే ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్​ మునుగోడు ప్రజల దగ్గరికి వస్తడని భావించిన. అందుకే  నేను రాజీనామా చేసిన. ఫామ్ హౌస్​లో పడుకున్న కేసీఆర్​ను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చిన” అని తెలిపారు.
ఉప ఎన్నిక ఉందని వంద మంది కౌరవ సైన్యం అవినీతి మూటలు పట్టుకుని మునుగోడు పల్లెల్లో మకాం వేసిందని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. నల్గొండ జిల్లా చండూరులో శనివారం నిర్వహించిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో రాజగోపాల్  మాట్లాడారు.  డబుల్ బెడ్రూం ఇండ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, రుణమాఫీ ఏమైందని కేసీఆర్​ను ప్రశ్నించారు. ‘‘ఈటల రాజేందర్ ను టీఆర్​ఎస్​ నుంచి బయటికి పంపిన రోజే కేసీఆర్ తన బొంద తానే తవ్వుకున్నడు” అని రాజగోపాల్​రెడ్డి తెలిపారు.
అసత్య ఆరోపణలు చేసి ఈటల రాజేందర్​ను కేసీఆర్​ బయటికి పంపిన రోజు ఫస్ట్​తానే ఈటలకు ఫోన్​ చేశానని, ఒక నియంతలాగా పాలిస్తున్న దోపిడీదారును గద్దె దించడానికి ఉద్యమించాలని కోరానని చెప్పారు. ‘‘వివేక్ వెంకటస్వామిని కూడా కేసీఆర్​ ఎంతో అవమానించిండు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే బీజేపీలో చేరాలని నా సమక్షంలోనే ఈటల రాజేందర్​ను వివేక్ వెంకటస్వామి ఆహ్వానించి ఢిల్లీకి తీసుకెళ్లారు” అని గుర్తు చేశారు.  బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదని, కేసీఆర్‌‌‌‌ నియంతలా అరాచక పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మునుగోడులో రాజగోపాల్​రెడ్డిని గెలిపించాలని ఉత్తర ప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి సంజయ్ నిశాంత్  కోరారు. అన్ని కుల వృత్తులకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్న పార్టీ బీజేపీ అని, అన్ని కులాలు బీజేపీతో కలిసి రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.  కిసాన్ క్రెడిట్ కార్డులాగే ఫిషరీస్ క్రెడిట్ కార్డును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీంతో మత్స్యకారులు రూ.1.60 లక్షలు క్రెడిట్ తీసుకోవచ్చని తెలిపారు
తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వం వచ్చాక ఎంతో కీలకంగా పనిచేసిన తనను, 20 ఏండ్ల సోపతిని కాదనుకొని కేసీఆర్‌‌‌‌ బయటకు వెళ్లగొట్టారని హుజూరాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌‌‌ పేర్కొన్నారు. ‘‘నన్ను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి బయటికి పంపిన తర్వాత మొట్టమొదట రాజగోపాల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ చేసి.. మీరు ఒంటరి కాదు.. వెంట ఉంటానని చెప్పారు. హుజూరాబాద్‌‌‌‌లో నా గెలుపుతో ప్రతి పల్లె పటాకులు కాల్చి సంబురాలు చేసుకుంది. రాజగోపాల్‌‌‌‌ రెడ్డిని కాంగ్రెస్‌‌‌‌ నుంచి సస్పెండ్‌‌‌‌ చేస్తామని సోనియాగాంధీ హెచ్చరించినా పట్టువిడవకుండా తెలంగాణ కోసం ఆయన కొట్లాడిండు” అని తెలిపారు.
ఎమ్మెల్యే పదవి ప్రజల ఆశీర్వాదంతోనే వచ్చింది. మూడున్నరేండ్లుగా కుమిలిపోతూ పదవిలో ఉండొద్దని, రాజీనామా అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని రాజగోపాల్​కు సూచించిన. ఎమ్మెల్యేకు గౌరవం లేకపోతే మునుగోడు ప్రజలకు లేనట్టేనని చెప్పిన. రాజీనామా ముఖం మీద కొట్టి ప్రజల చెంతకు  రాజగోపాల్​ వచ్చిండు. ఆయనకు ప్రజలు అండగా నిలవాలని రాజేందర్​ కోరారు.
ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా అనేక గ్రామాల్లో రోడ్లు వేయించిన ఘనత రాజగోపాల్‌‌‌‌ ది అని తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ పని ఖతమైపోయిందని అంటూ వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజలపై దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజగోపాల్‌‌‌‌ గెలుపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మలుపు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడులో కాంగ్రెస్‌‌‌‌కు ఓటేస్తే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు వేసినట్టేనని ఎంపీ డాక్టర్‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌ హెచ్చరించారు. ‘‘బీసీల హక్కుల గురించి ప్రశ్నిస్తున్నడనే ఈటల రాజేందర్‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌ బయటకు పంపిండు. తనను ప్రశ్నించేవారే ఉండొద్దన్నదని ఆయన నైజం. కేసీ ఆర్​ పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయమే లేదు” అని దుయ్యబట్టారు.

ఈనెల 31న మునుగోడుకు నడ్డా

ఈ నెల 31 న మునుగోడులో ఏర్పాటు చేయనున్న ఉప ఎన్నిక ప్రచార సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొననున్నారు.  ఈ నెల 30 న సీఎం కేసీఆర్ సభ, మరుసటి రోజే నడ్డా సభ జరగనుంది. నవంబర్ 1తో ఎన్నికల ప్రచారంకు గడువు ముగుస్తుంది. 
 
 మూడు రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్​లో  నడ్డాకు సమాధి కట్టడం, బీజేపీకి చెందిన ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ తిరిగి చేర్చుకోవడంతో సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న బీజేపీ శ్రేణులు నడ్డా సభతో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.