మునుగోడు కేటీఆర్ దత్తత తీసుకొంటారనడంపై లక్ష్మణ్ ఎద్దేవా 

మునుగోడులో ఎన్నిక‌లు జ‌రుగుతుంటే కేటీఆర్ అసెంబ్లీనీ ద‌త్త‌త   తీసుకుంటా అంటే మ‌రి స్థానిక ఎమ్మెల్యేలు అక్క‌ర లేదా ?  మునుగోడు ఒక్క‌టే ద‌త్త‌త తీసుకుంటారా మిగిలిని అసెంబ్లీలు అక్క‌ర లేదా ? అంటూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. 
 
జిల్లా లో మంత్రి ఉన్నాడని,  ఆయ‌న మిగిలిన మంత్రులంతా ఉన్నారు క‌దా వాళ్లు ఉన్నా వారు ఎందుకూ ప‌ని చేయ‌రా ?  వాళ్లెందుకు మునుగోడు గోడును ప‌ట్టించుకోలేదు .. వాళ్లంతా కేసీఆర్ కుటుంబానిక ఊ కొట్టే డూడూ బ‌స‌వ‌న్న‌లా మ‌రి ? అంటూ ప్రశ్నించారు. 
 
మునుగోడు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ  అంటే కేసీఆర్ కుటుంబ ద‌యా దాక్షిణ్యాల మీద ప్ర‌భుత్వం న‌డ‌వాలా, ప్ర‌జ‌లు కేసీఆర్  కుటుంబానికి  బానిస‌లుగా బ‌త‌కాలా అంటూ నిలదీశారు.
ప్ర‌జ‌ల‌ను బానిస‌లుగా చేసి ప‌రిపాలించిన ర‌జాకార్ల రాజ్యం అని తండ్రులు, తాత‌లు చెప్పే వాళ్లు కానీ ఇప్పుడు ప్ర‌జ‌స్వామ్యంలో  కూడా ర‌జాకార్ల పాల‌న ప్ర‌త్య‌క్షంగా చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.  ప్ర‌జ‌ల‌కు త‌మ గోడు , బాధ‌లు, కష్టాలు , న‌ష్టాలు చెప్పే అవ‌కాశం  లేదు .. స్వేచ్చ- స్వాతంత్రాలు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో బందీ అయిపోయాయి కాబ‌ట్టే   జ‌నం త‌మ కోపాన్ని ఉప ఎన్నిక‌ల్లో ఓట్ల‌ను బీజేపీకి వేస్తున్నారని హిప్పారు.
 
మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి 2014 నుంచి కేంద్రం నుంచి వివిధ ప‌థ‌కాల ద్వారా వ‌చ్చిన  నిధులెంత‌?  తెంగాణ స‌ర్కారు  నుంచి వ‌చ్చిన నిధులెన్నో చెప్పే ద‌మ్ముందా ?   ఆ నిధుల మీద శ్వేత ప‌త్రం ఇచ్చే ద‌మ్ముందా కేసీఆర్ ? అంటూ లక్ష్మణ్ సవాల్ చేశారు.  ఎక్క‌డ ఉప ఎన్నిక‌లుంటే అక్క‌డ వెళ్లి  రెండు కండ్ల సిద్దాంతం వ‌ల్లించే మీరు ఎన్నిక‌ల‌య్యాక అక్క‌డ క‌నీసం క‌న్నెత్తి  కూడా చూడ లేదని ధ్వజమెత్తారు.
 
ఉప ఎన్నిక‌ల్లో మీరు హుజూర్ న‌గ‌ర్ , నాగార్జున సాగ‌ర్ లో , దుబ్బాకలో ఇచ్చిన హామీలు  మీకు గుర్తున్నాయా క‌టీఆర్? అంటూ ఎద్దేవా చేశారు.   ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత అక్కడ క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌ని మీరు ఇక్క‌డికి వ‌చ్చి నీతి సూత్రాల‌ను వల్లె వేస్తున్నారని దుయ్యబట్టారు.
 
మీ కుటుంబం అవినీతి చ‌రిత్ర చిట్టాల‌న్నీ ప్ర‌తీరోజు వార్త‌ల్లో ప్ర‌జ‌లంతా చూస్తూనే ఉన్నారు …. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రం అభివృద్ది జ‌రిగిందా? మీ  కుటుంబం  అభివృద్ది జ‌రిగిందా? అనేది ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా తెలుసని బిజెపి నేత విమర్శించారు. 
 
దేశంలో ఎక్క‌డ ఉగ్ర‌వాదులు దొరికినా ప్ర‌తీ  లింక్  తెలంగాణ‌లో  ఉంట‌దని డా. లక్ష్మణ్ గుర్తు చేశారు. దానికి తోడు దేశంలో ఎక్క‌డ అవినీతి – అక్ర‌మాలు జ‌రిగినా కూడా వాటి లింక్ మీ పార్టీ  నాయ‌కుల్లో , ఇంకా మీ కుటుంబ స‌భ్యుల చుట్టూ ఉంట‌దని ఆయన ఆరోపించారు. 
 
 ఇదీ మీరు సాధించిన ప్ర‌గ‌తి గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా … అంటూ ఎద్దేవా చేశారు. చేసింది చెప్ప‌లేక , చెప్పుకోలేక  మీ మాట‌లకు  వోట్లు రాల‌య‌ని తెలిసినంక  కారు గ్యారేజీకి వెళ్తుంద‌ని తెలిసొచ్చి  రంగులు మార్చే ఊస‌ర‌వెళ్లి లాగా పార్టీల‌కు పేర్లు మార్చినంత   అలుక‌గా ప్ర‌జ‌ల‌ను ఏమార్చ‌లేరని స్పష్టం చేశారు.
 
మునుగోడు ఫ‌లితం తర్వాత  మీ కారు ప‌ర్మ‌నెంట్ అడ్రెస్ గ్యారేజీ మాత్ర‌మే , బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు  మిగిలేది  వీఆర్ఎస్  మాత్ర‌మే అంటూ లక్ష్మణ్ తేల్చి చెప్పారు.  లోట‌ల రాళ్లేసిన‌ట్టు లొడ లొడ వ‌ర్లుడు కాకుండా  మీరు చేసిన అభివృద్ది మీద చ‌ర్చించే ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రండి అంటూ సవాల్ చేశారు.
ప్ర‌జ‌ల మ‌ధ్య   మునుగోడు క‌చ్చిరి కాడ కూర్చొని కేంద్రం ఏం చేసింది,  కేసీఆర్ ఏం చేసిండో ప్ర‌జ‌ల‌కు చెబుదాం అంటూ నిలదీశారు.  తోక పార్టీల తోక‌లు ప‌ట్టుకున్న నాడే మీ పార్టీ పుట్టి  మూసీలో మునిగిందని ధ్వజమెత్తారు.