రూ. 34,615 కోట్ల బ్యాంక్ మోసం కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లపై కేసు

రూ. 34,615 కోట్ల బ్యాంక్ మోసం కేసులో ముంబైకి చెందిన ఎన్‌బీఎఫ్‌సీ (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధావన్, ధీరజ్ వాధావన్తో పాటు మరో 73 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. 

ప్రత్యేక సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో అతిపెద్ద బ్యాంక్ మోసం కేసులో మాజీ డీహెచ్‌ఎఫ్‌ఎల్ సీఈవో హర్షిల్ మెహతాను నిందితుడిగా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. మొత్తం 18 మంది వ్యక్తులు, 57 కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్ లో పేర్కొన వివరాల ప్రకారం  డీహెచ్‌ఎఫ్‌ఎల్ , అప్పటి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ వాధావన్, అప్పటి డైరెక్టర్ ధీరజ్ వాధావన్, వ్యాపారవేత్త సుధాకర్ శెట్టి, ఇతర నిందితులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియాన్ని మోసం చేయడానికి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. 

ఇక, కపిల్ వాధావన్, ఇతరులు రూ. 42,871 కోట్లకు భారీ రుణాలను మంజూరు చేయమని బ్యాంకులను కోరారు.   డీహెచ్‌ఎఫ్‌ఎల్   అకౌంట్స్ని తప్పుగా చూపడం ద్వారా నిధులలో పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్నారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధమైన బకాయిలను తిరిగి చెల్లించడంలో డిఫాల్టర్లుగా మారారు.

 దీంతో కన్సార్టియం రుణదాతలకు రూ.34,615 కోట్ల తప్పుడు నష్టం వాటిల్లింది. నిందితులందరిపై మోసం, అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. కాగా, 2010 నుండి ఈ సంస్థలకు బ్యాంకులు రుణాలను అందించాయి. రూ. 34,615 కోట్లకు పైగా రుణాలు 2019లో నిరర్థక ఆస్తులుగా ప్రకటించారు.