ఆర్థిక సేవలు పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు ప్రాధాన్యత

ఆర్థిక సేవలు పేదలకు అందుబాటులోకి తీసుకుని వెళ్లే  అంశానికి భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నదని కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో అభివృద్ధి చేసిన బలమైన డిజిటల్ వ్యవస్థ ద్వారా కల్పించిన మౌలిక సదుపాయాలు లక్ష్య సాధనకు సహకరిస్తున్నాయని ఆమె చెప్పారు. 

వాషింగ్టన్ డీసీ లో  అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక కమిటీవార్షిక సమావేశాలు 2022 సందర్భంగా జరిగిన  ప్లీనరీ సమావేశంలో ఆమె పాల్గొంటూ డిజిటల్ చెల్లింపుల విధానంలో ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల భారతదేశ లావాదేవీల ఖర్చు ప్రపంచంలో అతి తక్కువగా ఉందని ఆమె వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, అభివృద్ధి చెందుతున్న, తక్కువ-ఆదాయ దేశాలకు అందుబాటులో ఉన్న వనరులను అంతర్జాతీయ ద్రవ్య నిధి  పెంచాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. 

అనేక తక్కువ-ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న  తీవ్ర రుణ ఒత్తిడి ప్రపంచ పునరుద్ధరణకు కీలకమైన ప్రతికూల ప్రభావం చూపే  ప్రమాదం ఉందని  ఆర్థిక మంత్రి హెచ్చరించారు. చెల్లింపుల సమతుల్యత లాంటి ప్రభావాలను ఎదుర్కోవడానికి రుణ ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశాలకు తగిన సహకారం అందించాలని శ్రీమతి సీతారామన్ సూచించారు. 

 ఆహార అభద్రతను పరిష్కరించడంలో దేశాలకు సహాయపడటానికి  అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇటీవల  ఫుడ్ షాక్ విండో ద్వారా అమలు చేస్తున్న విధానాన్ని శ్రీమతి సీతారామన్ స్వాగతించారు. వాతావరణ మార్పు అంశాన్ని ప్రస్తావించిన  ఆర్థిక మంత్రి సమ విధానాలు, సాధారణ   బహుపాక్షిక విధానం, విభిన్నమైన బాధ్యతలు,  సంబంధిత సామర్థ్యాలు ఈ అంశంలో కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు.   

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల నుండి ఆర్థిక వృద్ధిని విడదీయడానికి అత్యున్నత స్థాయిలో జాతీయంగా నవీకరించబడిన నిర్ణయించిన విధానాలు అమలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు తగ్గించి అభివృద్ధి సాధించాలన్న లక్ష్యానికి   భారతదేశం కట్టుబడి ఉందని శ్రీమతి సీతారామన్ వివరించారు. 

అభివృద్ధి చెందిన దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్స్ , తక్కువ-ధర శీతోష్ణస్థితి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం లాంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని  ఆర్థిక మంత్రి కోరారు. ప్రపంచం ఎదుర్కొంటున్న వ్యూహాత్మక సవాళ్లను పరిష్కరించడానికి  ప్రపంచ దేశాలు సమన్వయంతో స్పందించి సహకరించాలని ఆమె సూచించారు.  

ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన విధంగా  7% వృద్ధి నమోదు చేస్తుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ భరోసా వ్యక్తం చేశారు. వృద్ధి సాధన కోసం ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న సంస్థాగత సంస్కరణలు, అనుకూలమైన దేశీయ విధానాలు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతున్నాయని  ఆమె చెప్పారు. 

ద్రవ్యోల్బణం పెరగకుండా చర్యలు అమలు చేస్తున్న భారతదేశం వృద్ధికి దోహదపడే విధానాలను అమలు చేస్తున్నదని ఆమె వివరించారు. “అతి పెద్ద ప్రజా  ప్రజా పంపిణీ వ్యవస్థ  ద్వారా గత 25 నెలలుగా 800 మిలియన్లకు పైగా బలహీన కుటుంబాలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందేలా చర్యలు అమలు చేసాం” అని ఆమె తెలిపారు. 

ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనం,  భౌగోళిక రాజకీయ అస్థిరత  పరిస్థితి  కారణంగా ఏర్పడుతున్న  సీమాంతర ప్రభావం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు వంటి కీలక ప్రతికూలతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొంటూ పెరుగుతున్న ఆహారం, ఇంధన వనరుల  ధరలు  ఆర్థిక వ్యవస్థపై  ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని శ్రీమతి సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు.