ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని ఓ వ్యక్తితో పాటు మరో రెండు సంస్థలకు కలిపి ఇచ్చారు. నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. బెలారస్కు చెందిన మానవ హక్కుల అడ్వకేట్ అలెస్ బియాలియాస్కీతో పాటు రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ, ఉక్రెయిన్కు చెందిన సివిల్ లిబర్టీస్ మానవ హక్కుల సంస్థలకు ఈ సారి ప్రైజ్ దక్కింది.
నోబెల్ శాంతి బహుమతి గెలిచినవాళ్లు తమ స్వదేశాల్లో సివిల్ సొసైటీ తరపున పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్లు నిరంతరం ప్రశ్నించారని, పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు కమిటీ వెల్లడించింది.
రష్యా, ఉక్రెయిన్, బెలారస్లో రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం దిశగా వెళుతున్న సమయంలో ఈ మూడు సంస్థలు యుద్ధ నేరాలు, మానవ హక్కులు, అధికార దుర్వినియోగం జరగకుండా అడ్డుకున్నాయని, ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం కోసం కృషి చేశాయని కమిటీ తెలిపింది.
యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపినట్లు తెలిపింది. శాంతి, ప్రజాస్వామ్యం కోసం శాంతి పురస్కార గ్రహీతలు ఎంతో కృషి చేసినట్లు నోబెల్ కమిటీ చెప్పింది.
మాజీ సోవియట్ యూనియన్లోని మానవ హక్కుల కార్యకర్తలు 1987లో మెమోరియల్ని స్థాపించారు. కమ్యూనిస్టు పాలనలో అణచివేతకు గురైన బాధితులను ఎన్నటికీ మరువలేమని భరోసా కల్పించాలని ప్రయత్నించారు.
“కొత్త నేరాలను నిరోధించడంలో గత నేరాలను ఎదుర్కోవడం చాలా అవసరం అనే భావనపై ఈ సంస్థ ఆధారపడి ఉంది. మిలిటరిజాన్ని ఎదుర్కోవడానికి, మానవ హక్కులు, చట్ట నియమాల ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో కూడా సంస్థ ముందంజలో ఉంది” అని నోబెల్ ప్రైజ్ కమిటీ తెలిపింది. .
రష్యా, రష్యా అనుకూల బలగాలు జనాభాపై జరిగిన దుర్వినియోగాలు, యుద్ధ నేరాలపై సంస్థ సమాచారాన్ని సేకరించి ధృవీకరించింది. 2009లో, చెచ్చయాలో మెమోరియల్ అధిపతి నటాలియా ఎస్టీమిరోవాను కూడా హతమార్చారు. మెమోరియల్ ఈ ఏడాది ప్రారంభంలో మూతపడింది. గత 30 ఏళ్లుగా మెమోరియల్ సంస్థ సోవియెట్ పాలనలో శిక్షించిన, బంధించిన, పీడించిన కొన్ని లక్షల మంది ప్రజల జ్ఞాపకశక్తిని పునరుద్ధరించేందుకు కృషి చేసింది.
ఉక్రెయిన్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ను స్థాపించారు. నోబెల్ కమిటీ సభ్యుల ప్రకారం, సంస్థ “ఉక్రేనియన్ పౌర సమాజాన్ని బలోపేతం చేయడానికి, ఉక్రెయిన్ను పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంగా మార్చడానికి అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక వైఖరిని తీసుకుంది”.
అంతేకాకుండా, ఫిబ్రవరి 2022లో దేశంపై రష్యా దాడి చేసిన తర్వాత ఉక్రేనియన్లపై రష్యా యుద్ధ నేరాలను గుర్తించి, డాక్యుమెంట్ చేసే ప్రయత్నాల్లో కేంద్రం నిమగ్నమై ఉంది. “తమ నేరాలకు దోషులను బాధ్యులను చేయడంలో కేంద్రం మార్గదర్శక పాత్ర పోషిస్తుంది,” అని పేర్కొంది.
ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నడిపిన బియాలియాస్కీ
1980 దశకంలో ఆ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని బియాలియాస్కీ నడిపారు. స్వదేశంలో ప్రజాస్వామ్యాన్ని, శాంతియుత అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన వియస్నా(స్ప్రింగ్) అన్న సంస్థను 1998లో స్థాపించారు. వివాదాస్పద రాజ్యాంగ సవరణల ద్వారా ఆ దేశ అధ్యక్షుడు నియంతృత్వ శక్తుల్ని పొందారు. దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగాయి.
ఆ సమయంలో వియస్నా సంస్థను స్థాపించిన అడ్వకేట్ అలెస్ మానవ హక్కుల కోసం తీవ్ర పోరాటం చేశారు. అధ్యక్ష అధికారాలను వ్యతిరేకిస్తూ జైలుపాలైన ఆందోళనకారులకు, వాళ్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచారు. కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఆ సంస్థ పూర్తి స్థాయి మానవ హక్కుల సంస్థగా రూపాంతరం చెందింది. రాజకీయ ఖైదీలకు మద్దతుగా ఆ సంస్థ పోరాటం చేసింది.
అలెస్ బియాలియాస్కీని అణగదొక్కేందుకు ప్రభుత్వ అధికారులు పదే పదే ప్రయత్నించారు. ఆయన్ను 2011 నుంచి 2014 వరకు జైల్లో వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2020లోనూ భారీ ఆందోళనలు జరిగిన సమయంలోనూ ఆయన్ను మళ్లీ అరెస్టు చేశారు. ఎటువంటి విచారణ లేకుండానే ఆయన్ను ఇంకా జైలులో ఉంచారు. ఎన్నో వ్యక్తిగత అవరోధాలను ఎదుర్కొన్న అలెస్ బెలారస్లో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏమాత్రం తలొగ్గలేదు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు