శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆమెఫై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖాశర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఆదేశించారు. 
 
తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదుకు స్పందిస్తూ ఈ ఘటనపై నిర్ధేశిత కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేయాలని, బాధిత మహిళకు సరైన వైద్య సదుపాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రేఖా శర్మ మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు
ఇటీవల కాలంలో శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ నిత్యం వివాదస్పదంగా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఓ మహిళా ప‌ట్ల అనుచితంగా ప్రవర్తించడం ఫై యావత్ ప్రజలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం సీఐ అంజు యాదవ్‌ ఓ మహిళ వద్దకు వెళ్లి ఆమె భర్త ఆచూకీ చెప్పాలంటూ ఆమెపై దురుసుగా ప్రవర్తించి, కాలుతో తన్నటం, చీర, జుట్టుపట్టుకుని లాగుతూ పోలీస్ వాహనంలో ఎక్కించడం.. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాత్రి 10 అవుతున్నా హోటల్ ఎందుకు తెరిచి ఉంచారని, నీ భర్త ఆచూకీ చెప్పాలని ధనలక్ష్మి అనే మహిళను విచక్షణా రహితంగా కొట్టి, పోలీస్ స్టేషన్ కు సిఐ తరలించారు.  తన ఆరోగ్యం భాగోలేదని.. ఆపరేషన్‌ అయ్యిందంటూ ఆ మహిళ మొరపెట్టుకున్నా కనికరించకుండా విరుచుకుపడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీకాళహస్తి ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్ ప్రవర్తించిన తీరు జుగుప్సకరంగా ఉందని  పేర్కొంటూ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి తొలుత ఈ దురాగతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. రక్షకభటులే నేడు భక్షించే పరిస్థితికి చేరారని ఆమె మండిపడ్డారు. ఒక మహిళ అన్న ఇంగితజ్ఞానం లేకుండా చిరు వ్యాపారి పట్ల అనుచితంగా వ్యహరించారని ఆమె  ధ్వజమెత్తారు. 
 
అయితే, ఏపీ మహిళా కమీషన్ అధ్యక్షురాలు పద్మ మాత్రం ఇప్పటివరకు స్పందించక పోవడం గమనార్హం. ఈ లోగా జాతీయ మహిళా కమీషన్ చర్యకు ఉపక్రమించింది.  ఈ విషయం జాతీయ మహిళా  హక్కుల కమిషన్ వరకూ వెళ్లడంతో విచారణ చేపట్టాలని తిరుపతి ఎస్పీ ఆదేశించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన అదనపు ఎస్పీ విమల కుమారి  బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తున్నారు. 

మొత్తం ఇప్పటివరకు 15 మందిని ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తయ్యాక రిపోర్ట్ ఇస్తామని అదనపు  ఎస్పీ విమలకుమారి తెలిపారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, ధనలక్ష్మిని కొట్టలేదని సీఐ అంజు యాదవ్ చెబుతున్నారు.  విచారణ కోసం వెళితే ఆమే తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని ఆమె ఆరోపించారు.