దేవరగట్టు బన్నీ ఉత్సవంలో 60 మందికి పైగా గాయాలు

క‌ర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా ఉత్సవాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా జరిగిన కర్రల సమరంలో 60 మందికి పైగా గాయపడ్డారు. కర్రల సమరానికి వెళ్తుండగా ఓ బాలుడు చ‌నిపోయాడు. అతడిని కర్నాటకలోని శిరుగుప్పకు చెందిన రవీంద్రనాథ్‌రెడ్డి (17)గా గుర్తించారు.  ఈ బన్నీ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించిన 2 లక్షల మంది తిలకించారు. 
 
గుండెపోటుతోనే చ‌నిపోయి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కర్రల సమరం సాగింది. ఈ కర్రల సమరంలో పలువురికి తలలు పగిలాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి ఆస్పత్రిలో తాత్కాలిక చికిత్స జరుగుతోంది. మెరుగైన చికిత్స కోసం పలువురిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. 
దేవరగట్టులోని శ్రీమాళ మల్లేశ్వర స్వామికి ఏటా దసరా రోజున బన్నీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జరిగే కర్రల సమరంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు,  అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు ఇంకోవైపు ఉండి కర్రలతో తలపడతారు.
స్వామి వారి మూర్తులను చేజిక్కించుకునేందుకు ఇరు వర్గాలు కర్రలతో హోరాహోరీగా క‌ర్ర‌ల‌తో స‌మ‌రం చేస్తారు. ఏళ్లుగా వస్తున్న ఆచారమిది. వర్షం కారణంగా ఈసారి కర్రల సమరం కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతరం జరిగిన సమరంలో 50 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
కాగా, కర్రల సమరాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాదు, రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే బన్నీ ఉత్సవాలనే కర్రల సమరంగా పేర్కొంటారు.  ఈ ఉత్సవాల్లో 10 గ్రామాల నుంచి వేలాదిమంది ప్రజలు కర్రలతో పాల్గొన్నారు.  అనేక మంది గాయాలపాలైన ఇది తమ సంప్రదాయంలో భాగమని అక్కడ ప్రజలు అంటున్నారు.