భారతీయ టెక్కీలకు అమెరికాలో ఏడేండ్లకు పైగా హెచ్-1 బీ వీసాపై ఐటీ సంస్థలో పని చేస్తే వారిక గ్రీన్ కార్డ్.. అమెరికా పౌరసత్వం పొందొచ్చు. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్ యాక్ట్ లో సవరణలు చేర్చారు. కొన్ని క్యాటగిరీల్లో పని చేస్తున్న భారతీయ టెక్ నిపుణులకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు సవరిస్తూ రూపొందించిన బిల్లును అమెరికా సెనెట్లో ప్రవేశ పెట్టారు.
దీని ప్రకారం అమెరికాలో వరుసగా ఏడేండ్లు పని చేస్తే గ్రీన్ కార్డు పొందడానికి అర్హత సాధించినట్లే. ఈ బిల్లును సెనెటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించగా, ఇతర సెనెటర్లు ఎలిజబెత్ వారెన్, బెన్రాయ్ లుజాన్, డిక్ దుర్బిన్ మద్దతు పలికారు.
అమెరికా ప్రజా ప్రతినిధుల సభలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఉమన్ జో లాఫ్గ్రెన్. జో లాఫ్గ్రెన్ ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ హౌస్ సబ్ కమిటీ చైర్గానూ వ్యవహరిస్తున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రస్తుతం హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న వారితో సహా 80 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.
ఇందులో హెచ్-1బీ వీసా దారులు, దీర్ఘకాలం వీసాపై పని చేస్తున్న నిపుణుల పిల్లలు, గ్రీన్ కార్డు డ్రీమర్లు, తదితరులకు గ్రీన్ కార్డు లభిస్తుంది. అంటే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దేశాల వారీగా కోటా ప్రకారం అమెరికా జారీ చేస్తున్న గ్రీన్ కార్డు కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న భారతీయ నిపుణులు అత్యధికంగా లబ్ధి పొందుతారని భావిస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్ చట్ట సవరణ బిల్లును సెనెటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదిస్తూ అమెరికా ఎకానమీకి వెన్నెముకగా ఉంటూ ఏండ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న వారి ఆశలు సాకారం చేసేలా మన అప్డేటెడ్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
“నేను ప్రతిపాదించిన బిల్లుతో 35 ఏండ్లకు పైగా అమెరికాలో నివాసం ఉంటూ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ తొలిసారి ఇమిగ్రేషన్ రిజిస్ట్రీ.. కటాఫ్ డేట్ అప్డేట్ చేస్తుంది. దశాబ్దాల తరబడి అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన వారి, జీవిస్తున్న వారి, పని చేస్తున్నలక్షల మంది ఇమ్మిగ్రెంట్లపై ఈ బిల్లు ప్రభావం చూపుతుంది” అని తెలిపారు.
యూఎస్ ఇమ్మిగ్రేషన్ సవరణ బిల్లు చట్టంగా మారడానికి కొంత సమయం ఉన్నది. తొలుత యూఎస్ సెనెట్, ప్రజాప్రతినిధుల సభ అంగీకరించి, ఆమోదించాలి. అటుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ బిల్లుపై సంతకం చేయడంతో చట్టంగా మారుతుంది.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ