పది నెలల్లో కొత్త టెలికాం పాలసీ బిల్లు

దేశంలో నూతన టెలికాం విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త టెలికాం బిల్లును 6- 10 నెలల్లో ప్రవేశపెడతామని, అయితే అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటామని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 137 సంవత్సరాల నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం బదులు ఈ కొత్త పాలసీ అమలులోకి వస్తుంది.

ఇప్పటి వరకూ 1933 నాటి ఇండియన్ వైర్‌లెస్ టెలీగ్రాఫ్ యాక్ట్, 1950 నాటి టెలిగ్రాఫ్ వైర్స్ (అన్‌లాఫుల్ పొసిషన్) యాక్ట్ టెలిగ్రాఫ్ చట్టం పరిధిలో అమలులో ఉన్నాయి. సంప్రదింపుల ప్రక్రియకు అనుగుణంగా తాము తుది ముసాయిదా బిల్లును రూపొందిస్తామని మంత్రి వివరించారు. తరువాత ఇది పార్లమెంట్‌కు చెందిన పరిశీలనా కమిటికి వెళ్లుతుందని.

తరువాత పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడుతారని తెలిపారు. ఇవన్ని పూర్తి అయ్యే వరకూ దాదాపు 10 నెలల లోపు సమయం పడుతుందని భావిస్తున్నారు. కాలపరిమితిని అయితే ఖరారు చేసుకున్నామని అయితే తొందరపడేది ఏమీ లేదని పేర్కొన్నారు.

దేశంలో తమ నిర్వహణకు సంబంధించి వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యూయో వంటి కాల్, మిస్స్సెజ్ సేవలలో ఉన్న మాధ్యమాలు తప్పనిసరిగా లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌కు, కాలింగ్ మిస్సేజ్‌ల సంబంధిత లైసెన్సింగ్ విధానంపై టెలికం రెగ్యులేటరీ అథార్టీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వైఖరిని ప్రభుత్వం తెలుసుకుంటోంది.

అయితే ఓటిటి యాప్స్ స్పష్టంగా లైసెన్సింగ్ పరిధిలోకి వచ్చేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు బిల్లు అంశాలతో స్పష్టం అయింది. మెస్సెజింగ్ యాప్‌లు టెలికం లైసెన్సు పరిధిలోకి వస్తే అవి ఖచ్చితంగా కెవైసి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. బిల్లులోని ప్రాధమిక అంశం ఒక్కటే అని యుజర్ల హక్కుల పరిరక్షణ అని మంత్రి తెలిపారు.

వినియోగదార్లు తమకు ఎవరు కాల్ చేస్తున్నారనేది తెలుసుకునే హక్కు కలిగి ఉంటారని ఈ మేరకు బిల్లులో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు. యాప్స్ వాడకం విషయంలో యుజర్ల బాధ్యతలు పాటించాల్సిన నిబంధనలను కూడా స్పష్టం చేశారు. దీని మేరకు యుజర్లు టెలికాం సేవలను పొందేందుకు ఖచ్చితంగా నిజమైన సమాచారం అందించాల్సి ఉంటుంది.

టెలికాం సేవలు పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిర్థారణ అయితే వారికి కనీసంఏడాది జైలు శిక్ష పడుతుంది. కొత్త చట్టం పరిధిలోకి వచ్చేందుకు టెలికాం సర్వీసు అందించే సంస్థలకు ఆప్షన్ కల్పిస్తారు. ఇప్పుడు టెలికం ఆపరేటర్లకు సర్కిళ్ల పరిధిలో ఉన్న గరిష్ట జరిమానా రూ 50 కోట్లను రూ 5 కోట్లకు తగ్గించాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.