
అక్టోబర్ మొదటి వారం నుంచి 5జి సేవలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ప్రభుత్వ జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ వెల్లడించింది. వచ్చేనెల ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 5జి సేవలు ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేసింది. ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్లో 5జి సేవలు లాంఛ్ కానున్నాయని ప్రకటించింది.
భారతదేశ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కనెక్టవిటీని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే క్రమంలో ప్రధాని ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ (డిఒటి), సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసి)ని నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా తక్కువ కాలంలోనే 5జి టెలికాం సేవలు 80 శాతం వినియోగదారులకు చేరువ కావాలని ప్రభుత్వం లక్షంగా నిర్దేశించుకుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ దేశ రాజధానిలో గత బుధవారం పారిశ్రామిక సమావేశంలో తెలిపారు.
కాగా, 5జి టెక్నాలజీ భారత్కు ఎంతో ఉపకరించనుందని నిపుణులు తెలిపారు. 2023- 2040 మధ్యకాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ రూ.36.4 ట్రిలియన్ డాలర్లు) ప్రయోజనం పొందనుందని మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ ఇండస్ట్రీ బాడీ ఇటీవల అంచనా వేసింది. 2030 నాటికి మొత్తం కనెక్షన్లలో మూడు వంతులు భాగం 5జి సొంతం చేసుకోనుంది.
2జి, 3జి కేవలం పది శాతం మాత్రమే ఉంటాయని గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ 79 శాతం ఉన్న 4జి వినియోగదారులు 5జి సేవలకు మారేందుకు సిద్ధంగా ఉన్నారని జిఎస్ఎంఎ తెలిపింది. కాగా, ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 5జి సేవలు ప్రారంభించనున్న సందర్భంగా ప్రధాని మోదీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఎయిర్టెల్ సునీల్మిత్తల్, ఐడియా ఇండియా రవీందర్ టక్కర్ వేదిక పంచుకోనున్నారని ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఐటి మంత్రి వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు హాజరుకానున్నారు. ఢిల్లీ, ముంబైతో సహా నగరాల్లో రిలయన్స్ జియో, విఐ 5జి సేవలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరగనుంది.
More Stories
అమెజాన్, వాల్మార్ట్లపై ఆంక్షలు తొలగింపుకై వత్తిడి
జులైలో పట్టాలపైకి దేశంలో తొలి హైడ్రోజన్ రైలు
మార్కెట్లో ప్రవేశించిన రూ 500 నకిలీ నోట్లు