ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌తో రూపాయి చాలా స్థిరంగా ఉంది

అమెరికా డాలర్‌తో ఇతర కరెన్సీలను కలుపుకుని పోలిస్తే రూపాయి చాలా బాగా స్థిరంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిణామాలపై చాలా నిశితంగా గమనిస్తున్నాయని, దేశీయ కరెన్సీ గ్రీన్‌బ్యాక్‌ (డాలర్)కు వ్యతిరేకంగా జీవితకాల కనిష్టానికి పడిపోయిన తర్వాత ఆర్థిక మంత్రి విలేకరులతో చెప్పారు.

“ఏదైనా ఒక కరెన్సీ దాని స్వంత కరెన్సీని కలిగి ఉండి, ఇతర కరెన్సీల వలె హెచ్చుతగ్గులు లేదా అస్థిరతకు గురికాకుండా ఉందంటే అది భారత రూపాయి. మనం చాలా బాగా స్థిరంగా ఉన్నాము” అని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌కు బలమైన కోటగా ఉన్న పూణే జిల్లాలో తన మూడు రోజుల పర్యటన చివరి రోజున  ఆమె తెలిపారు.

అమెరికా డాలర్‌తో శుక్రవారం నాడు రూపాయి 30 పైసలు క్షీణించి 81.09 వద్ద తాజా జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. విదేశాలలో బలమైన అమెరికన్ కరెన్సీ, పెట్టుబడిదారులలో రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ కారణంగా రూపాయి విలువ పతనమైంది. కాగా రూపాయి విలువని రక్షించుకోవడానికి ఆర్‌బిఐ డాలర్ నిల్వలను వెచ్చిస్తోంది. ఈ క్రమంలో  బిలియన్ల డాలర్ల కరెన్సీ ఆస్తులు (నిల్వలు) తరిగిపోయాయి.

ఇలా ఉండగా, కీల‌క వ‌డ్డీరేట్లు 75 బేసిక్ పాయింట్లు పెంచుతూ అమెరికా ఫెడ్ రిజ‌ర్వ్ తీసుకున్న నిర్ణ‌యంతో దేశీయ స్టాక్ మార్కెట్ల‌లోబుధ, గురు, శుక్ర వారంలలో  ఇటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్‌, అటు నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ రెండు శాతం న‌ష్ట‌పోయాయి. మూడు రోజుల్లో సెన్సెక్స్ 1620.8 పాయింట్లు ప‌త‌న‌మైంది.

బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.6.8 ల‌క్ష‌ల కోట్లు న‌ష్ట‌పోయి రూ.276.6 ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌డిపోయింది. శుక్ర‌వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,137.8 పాయింట్లు ప‌త‌న‌మైంది.