కేసీఆర్ ఇదేనా బంగారు తెలంగాణ?

సీఎం కేసీఆర్ ఇదేనా బంగారు తెలంగాణ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో నీటి ప్రాజెక్టుల నిర్వహిణపై కేసీఆర్‌ను నిలదీస్తూ కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం ఫలితంగా మహబూబాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ కాలువల ఆనవాళ్లు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. కొన్ని యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతుంటే… మరికొన్ని మట్టితో పూడుకు పోయాయని తెలిపారు.
 
ఇరిగేషన్ ఆఫీసర్లు నిర్వహణను గాలికొదిలేయడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నయని ఆమె చెప్పారు. జిల్లాకు స్టేజ్–1లో డీబీఎం–48, స్టేజీ–2లో డీబీఎం 57, 59, 60, 61, 63 కాలువల ద్వారా ఎస్సారెస్పీ నీళ్లు అందుతుండగా, ఆయా కెనాల్స్‌కు సంబంధించిన పిల్ల కాలువలన్నీ మూసుకుపోయాయని ఆమె తెలిపారు. ఓ వైపు భూముల రేట్లు పెరిగిపోవడంతో రియల్టర్లు కాలువలను ఆక్రమించేస్తున్నరని ఆమె పేర్కొన్నారు.
 
జిల్లాకు సాగు నీరు అందించాలని అప్పట్లో ఎస్సారెస్పీ పిల్ల కాలువలు నిర్మించారని విజయశాంతి గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం 15 మండలాల్లో ఇవి విస్తరించి ఉండగా ప్రస్తుతం ఈ కాలువలు కబ్జాకు గురికావడం, మట్టితో పూడుకు పోవడంతో ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా పోయాయని ఆమె విమర్శించారు. దీంతో నీరు విడుదలైన సమయంలో ఆ నీళ్లన్నీ వృథాగా పోతున్నయని తెలిపారు.
 
ఆఫీసర్లకు ఈ విషయం తెలిసినా అసలు పట్టించుకోవడం లేదని చెబుతూ ఏం కేసీఆర్? ఇదేనా బంగారు తెలంగాణ అంటే? అని ఆమె నిలదీశారు. కేసీఆర్ సర్కార్ తీరు వల్ల ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా వాసులు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన దుస్థితి వచ్చిందని విజయశాంతి మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అరాచకాలకు అడ్రస్‌గా మారిన కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ ప్రజానీకం త్వరలోనే గట్టి గుణపాఠం చెప్పడం ఖాయం అని ఆమె హెచ్చరించారు.