మార్గదర్శి కేసులో రామోజీరావుకు సుప్రీం నోటీసులు

రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణల కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌తోపాటు ఆ సంస్థ అధినేత రామోజీరావుకు సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రామోజీరావుపై ఉన్న నేరాభియోగాలను కొట్టివేస్తూ 2018 డిసెంబరు 31న ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
 
దీనిని సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్లను దానితో కలిపి న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
 
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదిస్తూ రామోజీ రావుపై నేరాభియోగాలను హైకోర్టు కొట్టివేయడం సరికాదని పేర్కొన్నారు. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. దాంతో, డిపాజిట్లను తిరిగి ఇచ్చేశారా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. పరిశీలించి చెబుతామని వికాస్‌ సింగ్‌ బదులిచ్చారు.
 
కాగా, మార్గదర్శి సేకరించిన డిపాజిట్లను వెనక్కి ఇవ్వడంపై గతంలో తాము దాఖలు చేసిన పిటిషన్‌తో ఈ క్రిమినల్‌ పిటిషన్‌ను జత చేయాలని ఉండవల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, న్యాయవాది అల్లంకి రమేశ్‌ విజ్ఞప్తి చేశారు. దాంతో, తదుపరి విచారణలో ఈ అభ్యర్థనను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
మరోవైపు, రామోజీ రావు దాఖలు చేసిన ఓ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అన్ని పిటిషన్లపై తదుపరి విచారణను డిసెంబరు రెండో తేదీకి వాయిదా వేసింది.