శ్రీనగర్, పుల్వామా, షోపియాన్‌లలో మళ్లీ సినిమా థియేటర్లు

జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు కనిపిస్తోంది. శ్రీనగర్, పుల్వామా, షోపియాన్‌లలో మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ సినిమా థియేటర్లు పని చేయడం ప్రారంభమవుతోంది. కొత్తగా నిర్మితమవుతున్న థియేటర్ ప్రాంగణాల్లో వినోదంతో పాటు, నైపుణ్య శిక్షణ వంటి ఇతర అంశాలు కూడా ఉంటాయి.
 
దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌, పుల్వామాల్లో ఏర్పాటు చేసిన మల్టీఫ్లెక్స్‌లను ఆదివారం జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రారంభించారు. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిషన్‌ యూత్‌ విభాగం, ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి నిర్మించాయి. ఇవి బహుళ ప్రయోజన సినిమాహాళ్లని సిన్హా చెప్పారు. ఇక్కడ సినిమాల ప్రదర్శనలతో పాటు, సమాచారం, యవత నైపుణ్యాభివృద్ధికి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. త్వరలో ప్రతి జిల్లాలోనూ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒక థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌, మరోదాంట్లో భాగ్‌ మిల్కా భాగ్‌లను ప్రదర్శించారు.
 
2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.   శ్రీనగర్‌లోని సోంవార్‌ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ మంగళవారం ప్రారంభం కానుంది. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో మూడు థియేటర్లు ఉన్నాయి. లాల్‌ సింగ్‌ ఛడ్డా సినిమాతో ఇవి ప్రారంభం కానున్నాయి. .
 
పుల్వామా, షోపియాన్లలోని సినిమాహాళ్ల ప్రారంభం సందర్భంగా మనోజ్ సిన్హా   ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక దినమని తెలిపారు. సినిమా హాళ్ళ ప్రారంభానికి సంబందించిన ఫొటోలను షేర్ చేశారు. బాలీవుడ్ చిత్రం ‘భాగ్ మిల్కా భాగ్’ను మనోజ్ సిన్హా వీక్షించారు.  ‘‘జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం! పుల్వామా, షోపియాన్లలో మల్టీపర్పస్ సినిమా హాల్స్‌ను ప్రారంభించాను. ఇక్కడ మూవీ స్క్రీనింగ్, ఇన్ఫోటెయిన్‌మెంట్, యువతకు నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలు ఉన్నాయి’’ అని సిన్హా కార్యాలయం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొంది. 

జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదం పెచ్చరిల్లడంతో 1990వ దశకం ప్రారంభం నుంచి సినిమా హాళ్లు మూత పడ్డాయి. సుమారు 10 సినిమా హాళ్ళు ఉండేవి, కానీ వాటి యజమానులకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చేవి. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న రీగల్ సినిమా థియేటర్‌పై 1999లో గ్రెనేడ్ దాడి జరిగింది. దీంతో వాటిని మూసేశారు.

కొన్ని థియేటర్లను పునఃప్రారంభించడానికి చేసిన ప్రయత్నాలు అప్పట్లో సఫలం కాలేదు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ, 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేశారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు.  గత సంవత్సరంగా జమ్మూ, కాశ్మీర్ పారిశ్రామిక విధానం, 2021లో భాగంగా మూతబడిన సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధపడింది. ప్రస్తుతం ఉన్న సినిమా హాళ్లను ఆధునీకరించడానికి, అత్యాధునిక సినిమా హాళ్లను నిర్మించడానికి కూడా ప్రోత్సాహకాలు ప్రకటించింది.

మరోవంక, సినిమాల నిర్మాణంకు, షూటింగ్ లకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటించింది. ఒకప్పుడు కశ్మీర్‌ షూటింగ్‌లకు స్వర్గధామంలా ఉండేది. ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన ఫిల్మ్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరిగి అటువంటి వాతావరణం కల్పించడంకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.

ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సినీ నిర్మాణం, చిత్రీకరణలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతోంది. జమ్మూ-కశ్మీరు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషితో సినిమాల ప్రదర్శనతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు అందజేయడం కోసం మల్టీపర్పస్ హాల్స్‌ను నిర్మిస్తున్నారు.