గతంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చురకలంటించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే..వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించలేదని మండిపడ్డారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భాంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన అమిత్ షా తొలుత అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాంతంత్య్రం వచ్చిందని చెబుతూ తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించారని చెబుతూ జలియన్వాలాబాగ్ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగిందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో పోలీసు చర్య తీసుకోవడం వల్లే తెలంగాణ విముక్తి లభించదని పేర్కొంటూ 109 గంటల పాటు సైనిక చర్య అవిశ్రాంతంగా జరిగిందని తెలిపారు.
నిజాంసేన, రజాకార్లను తరిమికొట్టి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని తెలిపారు .పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో నిజాం తలవంచారని..13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిందని చెప్పారు. కొమురం భీం, రాంజీ గోండ్, చెన్నారెడ్డి లాంటి ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులకు పటేల్ గౌరవ వందనం సమర్పించారని గుర్తు చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ యోధులందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని అమిత్ షా చెప్పారు. హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని అమిత్ షా వెల్లడించారు. పటేల్ లేకపోతే హైదరాబాద్ విమోచనానికి మరింత సమయం పట్టేదని అమిత్ షా పేర్కొన్నారు.
నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని ఆకృత్యాలు జరిగాయని చెబుతూ నిజాం సైనికులు, రజాకార్లు గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలిపారు. విమోచన దినాన్ని కొందరు రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని అమిత్ షా పేర్కొన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని ఈ సందర్బంగా అమిత్ షా విమర్శించారు. ఎవరి త్యాగాల వల్ల అధికారంలో ఉన్నారో..వారికి శ్రద్ధాంజలి వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లు అని..పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. ఈ సంవత్సరం హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని పేర్కొన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ప్రజలు కోరుకొంటున్నా 75 ఏళ్లుగా ఏ ప్రభుత్వం ముందుకు రాలేదని అమిత్ షా ధ్వజమెత్తారు. కేవలం విమోచన దినంగానే ఈ రోజు కార్యక్రమాలు జరపాలని స్పష్టం చేశారు.
More Stories
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి
సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలి
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’