కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజనాథ్ సింగ్

సినియర్‌ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు కుటుంభం సభ్యులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం పరామర్శించారు. పలు అనారోగ్య సమస్యలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు గత ఆదివారం మృతి చెందారు. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, సినీ హీరో ప్రభాస్‌ ను రాజ్ నాథ్ పరామర్శించారు.
 
కృష్ణం రాజు కుటుంబ సభ్యులు, ప్రభాస్ తో రాజ్ నాథ్ కొంత సేపు మాట్లాడారు. కృష్ణంరాజు మృతి పట్ల తన సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, ఏయే చికిత్సలు అందించారు, ఇతర వివరాలను బిజెపి నేతలు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు వివరించారు. 
 ప్రభాస్ కూడా కొంతసేపు రాజ్ నాథ్ తో మాట్లాడారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన రాజ్ నాథ్, ఇతర బిజెపి నేతలు అక్కడి నుంచి బయలుదేరారు.
కృష్ణంరాజు ఆత్మీయ మిత్రుడు 
 కృష్ణంరాజు మరణం చిత్రపరిశ్రమకు తీరనిలోటు అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ‘‘కృష్ణంరాజు నాకు ఆత్మీయ మిత్రుడు. ఢిల్లీలో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. 1998లో నేను కృష్ణంరాజును తొలిసారి కలిశాను. అప్పుడాయన పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఢిల్లీకి వచ్చారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు ఆయనకు చాలా దగ్గరయ్యాను’’ అని రాజ్ నాథ్ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 
 
 క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన కృష్ణంరాజు సంతాప సభకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
 
 ‘‘కొన్ని నెలల క్రితం ఢిల్లీలో కృష్ణంరాజును కలిసేందుకు వెళ్లినప్పుడు అనారోగ్యంతో ఉన్నట్లు అనిపించలేదు. చాలా బాగా నాతో మాట్లాడారు. పాత రోజులను గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు ఇక లేరనే ఆకస్మిక వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దాన్ని నేను చాలాసేపటి వరకు నమ్మలేకపోయాను’’ అని చెప్పారు.
 
 కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినా తనను అన్నగారు అని పిలిచేవారని తెలిపారు. వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండేవారని అంటూ  కృష్ణంరాజు 55 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారని చెప్పారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ని, కృష్ణంరాజు ని ప్రత్యేకంగా అభినందించానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.  
 ‘‘ప్రధానిని కలవాలి’’ అని ఇటీవలె కృష్ణంరాజు తనకు ఫోన్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. వైజాగ్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు కార్యక్రమానికి రాలేకపోయినందుకు కృష్ణంరాజు చాలా బాధ పడ్డారని తెలిపారు. సినీరంగంలో, రాజకీయాల్లోనూ మచ్చలేని మనిషిగా కృష్ణంరాజు పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. పార్టీలకు అతీతంగా చిన్నాపెద్దా, అన్ని రాజకీయ పార్టీనేతలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకున్నారని పేర్కొన్నారు. 

మర్యాదకి మారుపేరు కృష్ణంరాజు అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 55 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మంచి సినిమాలను చేశారని పేర్కొంటూ కృష్ణంరాజు మంచితనమే ప్రభాస్ కి వచ్చిందని తలసాని చెప్పారు. కృష్ణంరాజుకు,సీఎం కేసీఆర్ కు మంచి అనుబంధం ఉందని చెబుతూ ఫిల్మ్ నగర్ లో కృష్ణంరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.