కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని, ఇప్పుడు కేసీఆర్కు ఎలా భయపడతానని ప్రశ్నించారు. అయితే, తనకు తన కుటుంబ సభ్యులకు ఏమైనా కేసీఆర్ దే బాధ్యత అని హెచ్చరించారు.
హుజూరాబాద్లో విచ్చలవిడిగా గన్ లైసెన్స్లు ఇచ్చారని చెబుతూ ‘‘నాది కానీ, నా కుటుంబ సభ్యులది కానీ ఒక్క రక్తం బొట్టు కారినా.. పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ దే” అని తేల్చి చెప్పారు.
తప్పు చేసిన వాళ్ళు దొరలెక్క ఉంటున్నారని, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు శిక్షలు వేస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మండిపడ్డారు. శాసనసభలో బీజేపీ హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఈటల ఆరోపించారు. స్పీకర్ ను మరమనిషి అన్నందుకు తనకు శిక్ష వేశారని, మరి కేసీఆర్ అన్న మాటలకు ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు.
సంస్కారహీనుడు, అబద్దాలకోరు, చండాలంగా మాట్లాడే వ్యక్తి కేసీఆర్ మాత్రమే అంటూ విరుచుకుపడ్డారు. షర్మిల భాషపై స్పీకర్కు ఫిర్యాదు చేయటం దిక్కుమాలిన చర్య అని అంటూ వ్యక్తికి కాదు, ప్రధాని కుర్చీకి గౌరవం ఇవ్వాలని భట్టిని ఉద్దేశించి అసెంబ్లీలో కేసీఆర్ అనలేదా? అని ఈటెల ప్రశ్నించారు.
అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని పేర్కొంటూ ఒక సభ్యుడు ఉన్నా బీఏసీలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చేవారని గుర్తు చేశారు. బీఏసీ అంశం గురించి రఘునందన్ రావు అడిగినా స్పీకర్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్కు దమ్ముంటే ప్రజా తీర్పును కోరటానికి రావాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటూ కేసీఆర్ ను ఓడగొట్టేవరకు నిద్రపోను అని స్పష్టం చేశారు. సభ్యల హక్కులను కాపాడాల్సిన స్పీకరే తన హక్కులను కాలరాశారని మండిపడ్డారు. మళ్ళీ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా హజరై తీరుతానని స్పష్టం చేశారు.
తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అంటూ అవసరాల కోసం కేసీఆర్ తో ఎమ్మెల్యేలు ఉన్నారని, కొన్ని రోజులు ఆగితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి క్యూ కడతారంటూ భరోసా వ్యక్తం చేశారు. సభ జరుగుతున్న తీరును కాంగ్రెస్ ప్రశ్నించకపోవటం సిగ్గుచేటని అంటూ రైతుల సమస్యలు ప్రతిపక్షం కాంగ్రెస్కు పట్టదా అంటూ నిలదీశారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ఎప్పుడు జరగలేదని ఈటల విస్మయం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజాసమస్యలను అసెంబ్లీలో చర్చించలేదని మండిపడ్డారు. ప్రజలు హుజూరాబాద్ లో కేసీఆర్ ను తిరస్కరించి సభలోకి తనను పంపారని రాజేందర్ గుర్తు చేశారు. అటువంటిది తనను సభ నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు.
More Stories
తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
శుక్రవారం రెండో విడత పోలింగ్ కు రంగం సిద్ధం
బిజెపి మహిళా చేతిలో ఓవైసీ ఓటమి ఖాయం