14.3 శాతం వృద్ధిని నమోదు చేసిన మత్స్య రంగం

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎమ్ ఎమ్ ఎస్ వై) ఈ రోజు విజయ వంతంగా రెండో వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఈ గొప్ప రోజు ను పురస్కరించుకుని పిఎమ్ ఎమ్ ఎస్ వై ఫ్లాగ్ షిప్ కార్యక్రమం విజయాలు , భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించడానికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఈ రోజు న్యూఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎఫ్.ఎ.హెచ్.డి,  ఐ అండ్ బి సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, మత్స్య, పశుసంవర్ధక ,పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ శ్రీధర్ ,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. అయ్యప్పన్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఎఫ్ ఎ హెచ్  డి మంత్రిత్వ శాఖ కార్యదర్శి జతీంద్ర నాథ్ స్వైన్ కూడా హాజరయ్యారు.
సుమారు 300 మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులతో పాటు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ వేడుకకు హాజరై తమ అనుభవాలను,విజయ గాథలను పంచుకున్నారు. పిఎమ్ ఎమ్ ఎస్ వై గురించి, దాని విజయాల గురించి  మత్స్య సంపద పేరు తో వెలువరించిన బుక్ లెట్ ను, డిఒఎఫ్ న్యూస్ లెటర్ 3వ ఎడిషన్ ను , ఎగుమతి డైవర్సిఫికేషన్ కు ఉద్దేశించిన టిలాపియా యాక్షన్ ప్లాన్ ను, స్కాంపి యాక్షన్ ప్లాన్ ను,  2022-2025  నేషనల్ సీడ్ ప్లాన్ ను ఈ కార్యక్రమం లో ఆవిష్కరించారు.
ఈ ఉత్సవాన్ని నిర్వహించినందుకు, పథకం విజయాలను, భవిష్యత్తు ప్రణాళికను తెలియచేయడానికి బుక్ లెట్ లను ప్రచురించినందుకు కేంద్ర మంత్రి రూపాలా ఫిషరీస్ డిపార్ట్ మెంట్ ను, పిఎంసి బృందాన్ని అభినందించారు. డాక్టర్ ఎల్. మురుగన్ భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మత్స్య రంగం అభవృద్ధికి జరిగిన కృషి, భారతదేశంలో ఒక కీలకమైన రంగంగా మత్స్య రంగం సంప్రదాయ చరిత్ర గురించి వివరించారు.
జతీంద్ర నాథ్ స్వైన్ సాంకేతిక పరిజ్ఞానం, పబ్లిక్ స్టాకింగ్, నదీ, సముద్ర తీర ప్రాంతాలలో జలాశయాలను పునరుద్ధరించడం ద్వారా ద్వారా మన జలాశయాలు, సహజ వనరుల నిజమైన సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు.
పిఎమ్ ఎమ్ ఎస్ వై కేంద్ర బిందువుగా ఉన్న మత్స్య, చేపల రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పిఎమ్ ఎమ్ ఎస్ వై పథకం కింద మత్స్య రంగంలో విజయం సాధించినందుకు వారిని అభినందించారు. తరుణ్ శ్రీధర్ దేశంలో రొయ్యల విప్లవాన్ని ప్రవేశపెట్టడానికి సంబంధించి తన అనుభవాన్ని, మత్స్య రంగంలో వైవిధ్యతకు సంబంధించిన విలువైన సమాచారాన్ని పంచుకున్నారు.
 ఉత్పాదకత పరంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానానికి తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల ప్రాముఖ్యత , చేపల పెంపకంలో శాస్త్రీయ పద్ధతుల ఉపయోగం గురించి డాక్టర్ ఎస్. అయ్యప్పన్ నొక్కి చెప్పారు. ఎన్ ఎఫ్ డి బి చీఫ్ ఎగ్జిక్యూటివ్, డాక్టర్ సి. సువర్ణ,  పిఎమ్ ఎమ్ ఎస్ వై పథకానికి గల పటిష్ఠమైన నిర్మాణాత్మక అమలు వ్యవస్థ గురించి వివరించారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ ప్యాకేజీలో భాగంగా భారత ప్రభుత్వం రూ.20,050 కోట్ల పెట్టుబడులతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్ వై)ను ప్రవేశపెట్టింది. గత రెండు సంవత్సరాలలో, కోవిడ్ -19 ఈ రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసినప్పటికీ, ఈ రంగం క్రమబద్ధమైన విధానాన్ని అవలంబించడం ద్వారా ఈ పథకం కింద తిరిగి పుంజుకోగలిగింది.
గత రెండు సంవత్సరాల్లో (2019-20 నుంచి 2021-22 వరకు)  మత్స్య పరిశ్రమ 14.3% వృద్ధిని నమోదు చేసింది. గతం లో ఎన్నడూ లేనంతగా 2019-20లో 141.64 లక్షల టన్నులకు చేరిన చేపల ఉత్పత్తి 2021-22లో 161.87 లక్షల టన్నుల (ప్రోవిజనల్) కు చేరుకుంది.
అదేవిధంగా ఎగుమతుల్లో, రొయ్యల ఎగుమతులను మించి అధికంగా రూ.57,587 కోట్ల (7.76 బిలియన్ డాలర్లు) విలువ చేసే 13.64 లక్షల టన్నుల మత్స్య ఎగుమతులను మనం సాధించాము. ప్రస్తుతం మనం 123 దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. ఇప్పటివరకు పిఎమ్ ఎమ్ ఎస్ వై కింద 22 రాష్ట్రాలు , 7 కేంద్రపాలిత ప్రాంతాల లో 31.47 లక్షల మంది రైతులకు బీమా మద్దతు ఇచ్చింది.  ఇంకా అదనంగా 6.77 లక్షల మంది రైతులకు జీవనోపాధి , లీన్/బ్యాన్ కాలంలో పోషకాహార మద్దతు అందించింది.