గేమింగ్ యాప్ స్కామ్ సోదాల్లో రూ 7 కోట్ల నగదు

గేమింగ్ యాప్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శనివారం  కొల్‌కతాలోని   ఓ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా రూ 7 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనపర్చుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి. 
 
అయితే ఇక్కడ నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయని పూర్తి స్థాయిలో వీటి లెక్కలు కడుతున్నారని వెల్లడైంది. మొబైల్ గేమింగ్ యాప్ ఉదంతంలో ఇడి ఏకకాలంలో ఇక్కడ ఆరు ప్రాంతాల్లో దాడులకు దిగింది. ఈ క్రమంలో గార్డెన్ రీచ్ ప్రాంతంలో అమీర్‌ఖాన్ అనే వ్యాపారి ఇంట్లో ప్రధాన సోదాలు చేపట్టారు. 
 
ఇందులో రూ 7 కోట్ల డబ్బు స్వాధీనపర్చుకున్నారు. పలు ఆస్తుల పత్రాలను కూడా ఇడి పట్టుకుంది. అయితే ఇప్పటికీ ఇంకా నగదు లెక్కింపు జరుగుతోందని, వీటిని లెక్కించేందుకు నోట్ల లెక్కింపు మిషన్లు తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసు బలగాలను మొహరించారు.
బ్యాంకు అధికారులు , స్థానిక పోలీసు అధికారుల బృందాలు తరలిరాగా ఇడి సోదాలు నిర్వహించింది. కేంద్రీయ భద్రతా బలగాలను ఈ ప్రాంతంలోకి తరలించారు. దీనితో కొంత రాజకీయ వివాదం కూడా తలెత్తింది.
నిందితుడు వ్యాపారి అయిన అమీర్ ఖాన్ ఇ న్యూగ్గెట్స్ గేమింగ్ యాప్ ద్వారా యుజర్స్‌ను మోసగిస్తూ వస్తున్నారని, ఫెడరల్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో మనీలాండరింగ్ కేసు నమోదు దాఖలు అయిన తరువాత ఇడి సోదాలకు దిగింది. ఈ యాప్ మోసాలకు చైనా పేరిట నడుస్తోన్న రుణయాప్‌లు వాటి దారుణాలకు ఏదైనా లింక్ ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.