ఆరేళ్లలో 89 శాతం పెరిగిన బొమ్మల ఎగుమతులు

ఆరేళ్లలో 89 శాతం పెరిగిన బొమ్మల ఎగుమతులు
దేశీయ బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన వరుస చర్యల ఫలితంగా, 2018-19 నుండి బొమ్మల నాణ్యతలో గణనీయమైన మెరుగుదల,ఎగుమతుల్లో 89 శాతం పెరుగుదల నమోదైందని ప్రభుత్వం మంగళవారం తెలిపింది.  లోక్‌సభలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మాట్లాడుతూ, 2025లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్వహించిన సర్వేలో 95 శాతం బొమ్మల నమూనాలు నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలిందని, 2019లో ఈ సంఖ్య కేవలం 33 శాతంగా ఉండేదని పేర్కొన్నారు. 
 
అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, జర్మనీ వంటి మార్కెట్లకు ఎగుమతులు చేయడం ద్వారా భారతదేశం బొమ్మల నికర ఎగుమతిదారుగా మారింది. 2018-19 నుండి భారతదేశానికి బొమ్మల దిగుమతులు 37.5 శాతం తగ్గాయి. 2025-26 లో దిగుమతులు 232.3 మిలియన్ డాలర్లుగా, ఎగుమతులు 384.7 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 
 
దేశీయ డిజైన్‌ను ప్రోత్సహించడం, భారతీయ విలువలు, సంస్కృతి, చరిత్ర ఆధారంగా బొమ్మల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, 14 మంత్రిత్వ శాఖల సమన్వయంతో 21 కార్యాచరణ అంశాలతో కూడిన ‘బొమ్మల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక’ వంటి కీలక చర్యలను మంత్రి వివరించారు. 
అలాగే, బొమ్మలను అభ్యాస వనరులుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం; బొమ్మల డిజైన్, తయారీ కోసం హ్యాకథాన్‌లు, బొమ్మల ప్రదర్శనలు, ‘గ్రాండ్ ఛాలెంజ్‌’లను నిర్వహించడం; నాణ్యత పర్యవేక్షణను బలోపేతం చేయడం, నాణ్యత లేని, అసురక్షిత బొమ్మల దిగుమతిని నియంత్రించడం; స్వదేశీ బొమ్మల క్లస్టర్లను ప్రోత్సహించడం, దేశీయ తయారీని పెంచడం వంటి చర్యలు చేపట్టారు. 
 
అంతేకాకుండా, బొమ్మలపై (హెచ్ఎస్ కోడ్-9503) ప్రాథమిక కస్టమ్స్ సుంకం  ఫిబ్రవరి 2020లో 20 శాతం నుండి 60 శాతానికి పెంచి, ఆ తర్వాత 2023లో 70 శాతానికి పెంచారు. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ‘సాంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవనం కోసం నిధుల పథకం’ (ఎస్ఎఫ్ యుఆర్ టిఐ) కింద 18 బొమ్మల క్లస్టర్లకు ఆమోదం తెలిపింది. అలాగే జౌళి మంత్రిత్వ శాఖ 40 బొమ్మల క్లస్టర్లకు డిజైనింగ్ మరియు టూలింగ్ (తయారీ పరికరాల) మద్దతును అందిస్తుంది.
 
 ‘స్టార్టప్ ఇండియా’ చొరవ కింద డిపిఐఐటి ద్వారా 700కు పైగా స్టార్టప్‌లు గుర్తింపు పొందాయి. భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బొమ్మలపై బిఐఎస్ స్టాండర్డ్ మార్క్‌ను ఉపయోగించడానికి, దేశీయ తయారీదారులకు 1800కు పైగా, విదేశీ తయారీదారులకు 50కి పైగా లైసెన్స్‌లను బిఐఎస్ మంజూరు చేసింది.
 
జాతీయ విద్యా విధానం 2020, చిన్నపిల్లలలో అనేక సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి, వివిధ దశలలో ఉపయోగించాల్సిన బొమ్మలను, ముఖ్యంగా దేశీయ బొమ్మలు, ఆటలను నిర్దేశించింది. 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ బి2బి ఎగ్జిబిషన్‌లో 400 భారతీయ బొమ్మల బ్రాండ్లు, 40 దేశాల నుండి 100 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు, సుమారు 30,000 మంది వ్యాపార సందర్శకులు పాల్గొన్నారు.