అమ్మాయిలతో కలిసి చిందులేసిన వైస్ ఛాన్సలర్ 

గణేష్ నిమజ్జనం సందర్భంగా బాలికల హాస్టల్ లో అమ్మాయిలతో కలసి డీజే డాన్సులు చేయడం, తనతో చిందులేసిన వారికి డబ్బు పంపిణి వంటి అసభ్యకర ప్రవర్తనతో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితమే ఓ మహిళా ప్రొఫెసర్ పట్ల అనుచితంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కారు. 
 
డబ్బులు ఎగురవేస్తూ.. డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్టు తెలుస్తోంది.  శుక్రవారం రాత్రి  వినాయక నిమజ్జనం సందర్భంగా హాస్టల్ ఆవరణలో అమ్మాయిలు డీజే డాన్సులు చేశారు. విషయం తెలుసుకున్న వీసీ హుటాహుటిన హాస్టల్‌కు వెళ్లారు. బలవంతంగా గేటు తాళం తీయించి అమ్మాయిలతో కలిసి డాన్సు చేశారు.
 
ఇక తెలంగాణ యూనివర్సిటీకి ప్రొఫెసర్ రవీందర్​కు బాధ్యతలు అప్పగించి నప్పటి నుండి ఏదొక వివాదంతో రవీందర్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.  కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో డబ్బుల వసూళ్లు, స్టాఫ్ ప్రమోషన్లలో అక్రమాలు, అనర్హులకు రిజిస్ట్రార్, పీఆర్వో పోస్టులు,  యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల నుంచి మామూళ్ల వసూళ్లు, నిర్వహణ నిధుల దుర్వినియోగం వంటి పలు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
ఇలా తరుచు వివాదాల్లో నిలిచినప్పటికీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇక ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ లోకి వెళ్లి డాన్సులు చేయడం, చుట్టూ గర్ల్స్ ను పెట్టుకొని ఓ క్లబ్ లో మాదిరి చిందులు వేయడం ఏంటి అని వారంతా ప్రశ్నిస్తున్నారు.