కుషియారా నదీజలాలపై భారత్‌-బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం

కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌- బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం కుదిరినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంయుక్తంగా ఆ సమావేశ వివరాలను వెల్లడించారు. 

ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోందని. ఐటీ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో మరింత సహకరించుకోవాలని నిర్ణయించుకొన్నామని తెలిపారు. విద్యుత్తు పంపిణీ లైన్లపై చర్చలు జరుగుతున్నాయని చెబుతూ వరదల విపత్తు నిర్వహణలో సహకారం పెంపొందించుకుంటామని చెప్పారు. 

వరదలకు సంబంధించిన రియల్‌టైమ్ డేటాను బంగ్లాదేశ్‌తో పంచుకొంటామని పేర్కొన్నారు. “భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 54 నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి ఇరుదేశాల ప్రజలకు జీవనాధారం. ఈరోజు కుషియానా నదీ జలాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది” అని ప్రధాని వెల్లడించారు.

రానున్న కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని భరోసా వ్యక్తం చేస్తూ  ఈ ప్రాంతంలో భారత దేశానికి అభివృద్ధి, వ్యాపార రంగాల్లో  బంగ్లాదేశ్ అతి పెద్ద  భాగస్వామి అని ప్రధాని తెలిపారు. ఇరు దేశాల ప్రజల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోందని ఆయన చెప్పారు. 

బంగ్లాదేశ్ ఎగుమతులకు ఆసియాలో అతి పెద్ద మార్కెట్ భారత దేశమని చెప్పారు. ఈ ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు తాము త్వరలోనే ద్వైపాక్షిక ఆర్థిక సమగ్ర ఒప్పందంపై చర్చలను ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. 

బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ విజయవంతంగా జరుపుకున్న భారత ప్రభుత్వం, మిత్రులకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రహ్మాన్ ప్రసంగానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రధాని మోదీకి  ఆమె బహూకరించారు. హసీనా తన పర్యటనలో భాగంగా మంగళవారం రాజ్‌ఘాట్ లోని బాపూజీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఆమెకు రాష్ట్రపతి భవనంలో గౌరవ వందనం సమర్పించారు. 

అక్కడ ఆమెకు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హసీనా మాట్లాడుతూ భారత్‌ను సందర్శించడం తనకెప్పుడూ సంతోషం గానే ఉంటుందని తెలిపారు. “భారత్ మా మిత్ర దేశం. ముఖ్యంగా మా బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది. మాకు స్నేహసంబంధాలు ఉన్నాయి. పరస్పరం సహకరించుకొంటాం” అని ఆమె పేర్కొన్నారు. 

స్నేహంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని, దానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని హసీనా స్పష్టం చేశారు.  ఆర్థికంగా అభివృద్ధి  చెందడం, పీపుల్స్‌ ఫెడరేషన్‌, పేదరిక నిర్మూలన తమ ప్రధాన లక్ష్యమని షేక్‌ హసీనా పేర్కొన్నారు. ఈ సమస్యలపై ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నామని తాను భావిస్తున్నానని, తద్వారా భారత్‌, బంగ్లాదేశ్‌లోని ప్రజలతో పాటు దక్షిణ ఆసియా జనాలు మెరుగైన జీవితాలను పొందగలుగుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఆమె తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్‌తో భేటీ అయ్యారు. బంగ్లా ప్రధాని గురువారం రాజస్థాన్ లోని ఆజ్‌మేర్‌కు వెళ్లి మొయినుద్దీన్ చిస్తీ దర్గాను దర్శించే అవకాశం ఉంది. హసీనా చివరిసారిగా 2019లో భారత్ లోపర్యటించారు.