రఫేల్ పై మరోసారి దర్యాప్తునకు సుప్రీం తిరస్కారం

ఫ్రాన్స్ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధవిమాన కొనుగోలుకు సంబంధించి ఇరుదేశాల మధ్య కుదిరిన డీల్‌పై మరోసారి దర్యాప్తు చేపట్టాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.  
 
న్యాయవాది ఎం.ఎల్.శర్మ దాఖలు చేసిన పిల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి  ఉదయ్ రమేష్ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌ తో కూడిన ధర్మాసనం పరిశీలించిన అనంతరం ఈ తీర్పునిచ్చింది. ఈ డీల్ వ్యవహారంపై మరోసారి లెటర్స్ రొగేటరీ జారీ చేసి ఆధారాలు సేకరించాలని ఎం.ఎల్.శర్మ కోరారు. 
 
దసో సంస్థ మధ్యవర్తలకు బిలియన్ డాలర్లు చెల్లించినట్టు ఫ్రెంచ్ పోర్టల్ మీడియా కథనంలో పేర్కొనడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే, ఈ అంశాన్ని తిరిగి పరిశీలించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో తన పిల్‌ను న్యాయవాది వెనక్కి తీసుకున్నారు.
 
రఫేల్ జెట్లు కొనుగోలుకు సంబంధించి ఇండియా-ఫ్రాన్స్ మధ్య కుదిన ఒప్పందాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను 2018 డిసెంబర్ 14న అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. డీల్‌ను అనుమానించేందుకు తగిన సందర్భాలు కనిపించడం లేదని తీర్పులో పేర్కొంది.