చైనా సరిహద్దుల్లో తేలికపాటు ‘జోరావార్’ యుద్ధ ట్యాంకులు

చైనా సరిహద్దుల్లో తేలికపాటు ‘జోరావార్’ యుద్ధ ట్యాంకులు

సరిహద్దులో సామరస్య వాతావరణం కోసం పలు దఫాలుగా సైనిక స్థాయి చర్చలు జరుపుతున్నా కలసి రాకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, తన సైనిక సామర్ధ్యాన్ని, మౌలిక సదుపాయాలను పెంచుకొంటూ వస్తున్న చైనాను  కట్టడి చేయడం కోసం భారత సైన్యం కూడా సిద్దపడుతున్నది.

చైనా సరిహద్దులో ఆర్మీ సామర్థ్యాల పెంపునకు వ్యూహాత్మకంగా తేలికపాటు ‘జోరావార్’ యుద్ధట్యాంకులు, డ్రోన్లను పెద్ద సంఖ్యలో సేకరించాలని  నిర్ణయించింది. ఇందు కోసం ‘ప్రాజెక్ట్ జోరావార్’ను ప్రారంభించినట్టు ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో 350కిపైగా దేశీయ తయారీ ‘జోరావార్’ యుద్ధట్యాంకులను ఆర్మీ సమకూర్చుకోనుంది.

తక్కువ బరువుండే ఈ ట్యాంకులను వాయుమార్గంతో పాటు భూతలంపై కూడా సులభంగా తరలింపునకు వీలుంటుంది. అంతేకాకుండా పర్వత ప్రాంతాల్లో ఆపరేషన్లలో ఈ ట్యాంకులు సౌకర్యవంతంగా ఉంటాయి. జోరావార్ ట్యాంక్ లేదా ఏఎఫ్‌వీ-ఐఎల్‌టీ ట్యాంకుల తయారీలో పాటించాల్సిన సాంకేతిక ప్రమాణాలను ఆర్మీ ఖరారు చేసింది. అధిక శక్తితో పాటు ట్యాంకు బరువు 25 టన్నులు మించకూడదని నిర్దేశించింది.

ఫైర్‌ఫవర్ కూడా గణనీయ స్థాయిలో ఉండాలని పేర్కొంది. ఇక ఈ ట్యాంకుల్లో అధునాతన సాంకేతికతలైన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డ్రోన్ ఇంటిగ్రేషన్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, హైడిగ్రీ ఆఫ్ సిచ్యువేషనల్ అవేర్‌నెస్ ఉండాలని ఆర్మీ పేర్కొంది. కాగా ప్రాథమిక ఆమోదం కోసం ఈ ప్రమాణాలను రక్షణ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌లో పరిశీలించనుంది.

మరోవైపు అధిక ఎత్తు, లోతట్టు ప్రాంతాల్లో నిర్దేశిత పరిధిలోని లక్ష్యాలపై దాడులకుగానూ రెండు ఇండియన్ స్టార్టప్ కంపెనీల నుంచి డ్రోన్లను సమీకరించాలని ఆర్మీ నిర్ణయించింది. ఆ తర్వాత ఏఎస్‌ఏడీ-ఎస్ (అటానమస్ సర్వైలెన్స్ అండ్ ఆర్మ్‌డ్ డ్రోన్స్ స్వార్మ్) కోసం ‘మేకిన్ ఇండియా’  కార్యక్రమం కింద మరిన్ని డ్రోన్లను ఆర్మీ సమీకరించనుంది.

కాగా రెండేళ్లక్రితం తూర్పు లద్ధాఖ్‌లో చైనా-భారత్ ఆర్మీల ఘర్షణ, ఆ తర్వాత ప్రతిష్ఠంభన పరిణామాన్ని ఒక పాఠంగా స్వీకరించిన ఇండియన్ ఆర్మీ ‘ప్రాజెక్ట్ జోరావార్’ను మొదలు పెట్టింది. లద్ధాఖ్ ప్రతిష్ఠంభన సమయంలో ఇరుదేశాల బలగాలు పెద్ద సంఖ్యలో ట్యాంకులు, హోవిట్జర్లు, సర్‌ఫేస్ టు ఎయిర్‌ మిసైల్ సిస్టమ్స్‌ను మోహరించిన విషయం తెలిసిందే.

 హంగేరియన్ ట్రెక్కర్‌ను కాపాడిన భారత సైన్యం

ఇలా ఉండగా, హిమాలయ పర్వత ప్రాంతాల్లో దారి తప్పిన హంగేరియన్ ట్రెక్కర్‌ను భారత సైన్యం కాపాడింది. జమ్మూ-కశ్మీరులోని కీష్త్వర్ జిల్లా, ఉమసి కనుమలో సుమారు 30 గంటల పాటు శ్రమించి నిర్వహించిన గాలింపు చర్యల్లో ఆయన జాడను గుర్తించి, రక్షించింది. చికిత్స కోసం ఆయనను భారత వాయు సేన హెలికాప్టర్లో ఉధంపూర్ తరలించారు.

భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, హంగేరియన్ జాతీయుడు అక్కోయీస్ వెర్మీస్‌ ను భారత వాయు సేన, భారత సైన్యం గుర్తించి, కాపాడినట్లు తెలిపింది. హిమాలయ పర్వత ప్రాంతంలోని ఉమసి కనుమలో ఆయన దారి తప్పిపోయారని తెలిపింది. ఆయనను చికిత్స కోసం ఐఏఎఫ్ ఉధంపూర్‌నకు తరలించినట్లు పేర్కొంది.

కీష్త్వర్‌లోని డుల్ నుంచి ఈ ఆపరేషన్ జరిగినట్లు వివరించింది. కీష్త్వర్-జన్‌స్కర్ మధ్య ఉమసి కనుమ ఉంది. అక్కోయీస్ వెర్మీస్‌ లడఖ్‌లో దారి తప్పారా? అనే విషయం తెలియలేదు. జూన్‌లో కూడా ఇదే విధంగా 17 మందిని భారత సైన్యం కాపాడింది. ఏడు సరస్సుల ట్రెక్కింగ్ కోసం వీరు వచ్చారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విషన్ సార్ సరస్సు వద్ద చిక్కుకుపోయారు.