ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్

ప్రజాస్వామ్యం గురించి ప్రసంగాలిచ్చే తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ  వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు.  జనగామలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై జరిగిన దాడిని టీఆర్ఎస్ గూండాగిరిగా పేర్కొంటూ శాంతియుతంగా జరుగుతున్న పాదయాత్రలో జరిగిన హింసకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
బెంగాల్ తరహా హింసా రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించబోరని తరుణ్ చుగ్ హెచ్చరించారు.  పోలీసులు సైతం ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని పేర్కొంటూ ఎప్పటికీ టీఆర్ఎస్ అధికారంలో ఉండదన్న విషయాన్ని పోలీసులు సైతం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అధికారం చేజారిపోతుందన్న కలతతో నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు.
అందుకే ఈ తరహా దాడులకు తెగబడుతున్నారని చెబుతూ ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా,  మునుగోడు ఉపఎన్నికలకు బిజెపి సన్నద్ధమవుతోందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక తేదీని ఖరారు చేసిన వెంటనే తమ వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేస్తామని తరుణ్ ఛుగ్ చెప్పారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక కార్యక్రమాన్ని భారీస్థాయిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోందని చెబుతూ  కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే ఈ కార్యక్రమం వేదిక, తేదీ, సమయాన్ని ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. మునుగోడులో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుందన్న వ్యాఖ్యలను కొట్టిపారవేసారు.
 గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనూ బీజేపీ గెలుపు సాధ్యం కాదని అన్నారని, కానీ చివరకు ప్రజాతీర్పు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని గుర్తు చేశారు. ఇప్పుడు మునుగోడు విషయంలోనూ అదే పునరావృతమవుతుందని తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు బీజేపీలో చేరికల పర్వం మరింత ఊపందుకుంటుందని చుగ్ తెలిపారు. ఈనెల 18న హైదరాబాద్‌లో కొందరు పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ నుంచి సైతం నేతలు తమతో మంతనాలు సాగిస్తున్నారని చెప్పారు. ఇక నుంచి ప్రతి రోజూ చేరికలు ఉంటాయని వెల్లడించారు.