అన్ని వేరియంట్లపైనా పనిచేసే బూస్టర్‌ టీకా

ఆల్ఫా, బీటా, గామా, డెల్టా లాంటి పాత వేరియంట్లకే కాక కొత్తగా పుట్టుకొచ్చిన ఒమైక్రాన్‌ సహా అన్ని వేరియంట్లపైనా పనిచేసే బూస్టర్‌ టీకాను మోడెర్నా సంస్థ తీసుకొచ్చింది. క్లినికల్‌ ట్రయల్స్‌ అనంతరం యూకే ప్రభుత్వం దీన్ని ఆమోదించింది.  ఈ బూస్టర్‌లో సగం మోతాదు 2020లో వచ్చిన తొలి రకం వైర్‌స ను, మిగిలిన సగం టీకా ఒమైక్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని పోరాడుతుందని వివరించింది. దీన్ని మోడెర్నా బైవాలెంట్‌ బూస్టర్‌ వ్యాక్సిన్‌గా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు.. మోడెర్నా బూస్టర్‌ టీకాను భారత్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సఐఐ) చీఫ్‌ అదర్‌ పూనావాలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మరో 6 నెలల్లో ఇది దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒమైక్రాన్‌ను లక్ష్యంగా చేసుకునే ఇటువంటి బూస్టర్‌ డోసు భారత ప్రజలకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
దీనికి సంబంధించి ఇప్పటికే విదేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిసిన నేపథ్యంలో భారత్‌లో ఆమోదానికి మరోమారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు.
భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు విజయం
మరోవంక, కరోనా నుంచి రక్షణ కోసం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన నాసల్‌ వ్యాక్సిన్‌ బీబీవీ154 ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది పూర్తిగా సురక్షితమైందని, వ్యాధి నిరోధక వక్తిని సమర్ధవంతంగా ప్రేరేపిస్తుందని ప్రకటించింది.
ఈ చుక్కల మందును సెయింట్‌ లూయిస్‌ లోని వాషింగ్టన్‌ యూనివర్శిటీ భాగస్వామ్యంతో ప్రతేకంగా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను ముక్కు రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయోగ ఫలితాలను ఔషధ నియంత్రణ సంస్థలకు తెలిపినట్లు కంపెనీ వెల్లడించింది. పేద, మధ్యతరగతి దేశాలకు తక్కువ ధరకే అందించాలన్న లక్ష్యంతో నాసల్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసినట్లు భారత్‌ బయోటెక్‌ కంపెనీ తెలిపింది.
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సాయంతో ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించింది. బీబీవీ154 టీకాను ప్రాథమిక డోస్‌గా, బూస్టర్‌ డోస్‌గా వినియోగించడంపై వేర్వేరుగా ప్రయోగాలు నిర్వహించారు.  ఈ టీకాను 2-8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద భద్రపరిచి సులభంగా రవాణా చేయవచ్చని కంపెనీ తెలిపింది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజున బీబీవీ154 టీకా విజయవంతమైందని ప్రకటించడం గర్వకారణంగా ఉందని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా తెలిపారు.