టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించిన పంజాబ్ పోలీస్‌లు

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీస్‌లు ఢిల్లీ పోలీస్‌ల సహకారంతో పాక్ ఐఎస్‌ఐ మద్దతున్న టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. కెనడాకు చెందిన ఆర్ష్‌దల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్‌తో సంబంధం ఉన్న నలుగురు సభ్యులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
నిందితుల నుంచి మూడు గ్రెనేడ్లు, ఒక ఐఈడీ, రెండు 9 ఎంఎం పిస్టల్స్, 40 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు పంజాబ్ డీజీపీ తెలిపారు. ఇంతకు ముందు ఏప్రిల్‌లో పంజాబ్ పోలీసుల ఇంటెలిజెన్స్ వింగ్ పారిపోయిన గ్యాంగ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్‌దల్లా ఇద్దరు సన్నిహితులను అరెస్టు చేసింది.

అర్ష్‌దల్లా ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్. ఇతని స్వస్థలం మోగా. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. చాలా కాలంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. పంజాబ్ పోలీసులు ఇప్పటికే అర్ష్‌దల్లాకు చెందిన పలు మాడ్యూల్స్‌ను ఛేదించడంతోపాటు అతని సన్నిహితులను అరెస్టు చేశారు.
 
ఐడీలు, గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలతో పాటు మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీ లోని దక్షిణ ద్వారకా జిల్లా పోలీసుల బృందం పాలం ప్రాంతంలో తనిఖీ చేస్తున్న సమయంలో ఇద్దరు బంగ్లా జాతీయులను అరెస్టు చేసింది. 
 
వారి నుంచి బంగ్లాదేశ్ మంత్రిత్వ శాఖలకు చెందిన పది నకిలీ రబ్బర్ స్టాంపులు, పలు పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరినీ ప్రస్తుతం విచారిస్తున్నారు.