జైలులో ఉండాల్సిన ఆర్జేడీ మాజీ ఎంపీ ఇంటి వద్ద ప్రత్యక్షం 

బీహార్ లో ఆర్జేడీ మద్దతుతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే జంగల్ రాజ్యం తిరిగి ప్రత్యక్షం అవుతున్నట్లు ఒక వంక బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నది. కొత్త ప్రభుత్వం అడిహకారంలోకి వచ్చిన కొద్దీ గంటలలోనే రాష్ట్రంలో నేరాల సంఖ్య ఏ విధంగా పెరుగుతున్నదో వివరాలు వెల్లడిస్తున్నది.

ఈ లోగా యావజీవ జైలు శిక్ష అనుభవిస్తూ జైలులో ఉండాల్సిన ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ అకస్మాత్తుగా ఇంటి వద్ద, కుటుంభం సభ్యులతో కనిపించడం కలకలం రేపుతున్నది. గోపాల్ గంజ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు పడి ప్రస్తుతం సహర్సా జైలులో ఉన్నారు.

అయితే, ఆనంద్ మోహన్ అనూహ్యంగా తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో ఇంటి వద్ద కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ కావడం సంచలనమైంది. పాట్నాలోని కోర్టు మందు ఆగస్టు 12న ఆనంద్ మోహన్ హాజరయ్యారు. తిరిగి వెళ్తూ తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, మద్దతుదారులను కలిశారు. ఆయన భార్య లవ్లీ ఆనంద్, కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ కూడా గ్రూప్ ఫోటోలో కనిపిస్తున్నారు.

కాగా, పాటలీ పుత్రలోని 166/బి నివాసంలో ఆనంద్ మోహన్ తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో చాలా సేపు గడిపారని, రక్షాబంధన్ రోజును ఆయనను చూశామని స్థానికులు చెబుతున్నారు. ఆర్జేడీ హయాలో అనేక మంది బాహుబలుల్లాంటి ఖైదీలు జైలు నుంచి బయటకు వచ్చిన ఉదంతాలున్నాయని అంటున్నారు.

గోపాల్ గంజ్ డీఎం జి.కృష్ణయ్య హత్య కేసులో 2007లో ఆనంద్‌ మోహన్‌కు ఉరిశిక్ష పడింది. అయితే, సుప్రీంకోర్టు ఆ శిక్షను తగ్గించి జీవిత ఖైదుగా మార్చింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. ఇప్పటి వరకూ 14 ఏళ్లు ఆయన జైలు జీవితం గడిపారు.

దీంతో ఆయనను విడుదల చేయాలంటూ సమయం వచ్చినప్పుడల్లా ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఆనంద్ మోహన్ కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ సైతం నితీష్‌కుమార్‌కు పలు విజ్ఞాపనలు చేశారు. అయితే, నితీష్ మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు.

కానీ, ప్రస్తుతం ఆర్జేడీతో కలిసి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆనంద్ మోహన్ విడుదలపై ఆశలు చిగురించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 14 ఏళ్లు జైలు శిక్ష పూర్తయితే ఖైదీ ప్రవర్తన ఆధారంగా జైలు శిక్షను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించవచ్చు.