వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు.
ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు ఆయన పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు.
గత రెండేళ్లలో ఇది నీతి ఆయోగ్ తొలి భౌతిక సమావేశం. కరోనా కారణంగా 2021లో భేటీ వర్చువల్గా జరిగింది. 4 కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నల్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్ సీఎం నితీశ్కుమార్, కరొనాకు గురైన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైలు సమావేశానికి రాలేదు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు హాజరు కాలేదో తెలియదు.
నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు.
అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏ ఒక్క పార్టీ అజెండానో కాదని, అందరి ఉమ్మడి లక్ష్యమని గుర్తుంచుకోవాలని తెలిపారు.
‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అని ప్రధాని చెప్పారు.
కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని ప్రధాని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రమూ ఓ జీ20 టీమ్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు