కృష్ణా నది మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటాలను నిర్ధారించే అంశం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిశీలనలో ఉందని జల శక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్ట్లలో 75 శాతం నికర జలాలకు మించి ప్రవహించే మిగులు జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు నిర్దుష్టమైన విధానం రూపకల్పన చేసే బాధ్యతను కేఆర్ఎంబీ రివర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)కి అప్పగించినట్లు తెలిపారు.
వర్షా కాలంలో కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్ట్ల నుంచి విడుదలయ్యే మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నియంత్రిత పద్ధతిలో పంపిణీ చేసేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు చెందిన సాంకేతిక సంఘాన్ని తమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు.
అయితే ఉభయ రాష్ట్రాలు దీనికి సంబంధించిన అవసరమైన సమాచారం సమర్పించకపోవడంతో సాంకేతిక సంఘం తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఒక నీటి సంవత్సరంలో కృష్ణా నదిలో లభించే మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్ ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పించింది.
మిగులు జలాల వినియోగం తప్ప వాటిపై ఆంధ్రప్రదేశ్కు హక్కు ఉండబోదని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్ట్ల వారీగా కేటాయింపులు చేసేందుకు కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్ కాలపరిమితిని పొడిగించడం జరిగిందని మంత్రి వివరించారు.
More Stories
జగన్ సొంతజిల్లాలోనే శాంతిభద్రతలు సరిగా లేవు
సజ్జల కుమారుడిపై సీఐడీ విచారణకు ఈసి ఆదేశం
ఏపీ డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు