రూ.50 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్  మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత  ఫరూఖ్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేకేఏ)కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ఆయన మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలను నమోదు చేసింది.
ఫరూఖ్ అబ్దుల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో  దాదాపు రూ.43.69 కోట్ల నిధులను ఇష్టానుసారంగా ఎవరు పడితే వారి ఖాతాలకు మళ్లించారని చార్జిషీట్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మే 31నే ఫరూఖ్ అబ్దుల్లాను ఈడీ దాదాపు 3 గంటలపాటు ప్రశ్నించింది.
తాజాగా ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో శ్రీనగర్ లోని మనీలాండరింగ్ వ్యవహారాల (పీఎంఎల్ఏ)  కోర్టు  ఇవాళ ఫరూఖ్ అబ్దుల్లాకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 27న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నిర్దేశించింది.
 ఈ అభియోగాల దృష్ట్యా 2020 సంవత్సరంలో ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన దాదాపు రూ.11.86 కోట్ల విలువైన ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. 2018 జులై 11న ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది.  మొత్తం రూ.51.90 కోట్ల అవకతవకలు జరిగాయని దర్యాప్తులో గుర్తించిన ఈడీ, ఇప్పటివరకు రూ.21.55 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.