ఇక నుంచి థియేటర్లో రిలీజైన 10 వారాల తర్వాతే భారీ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. ఈ మేరకు తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సినీ నిర్మాతల మండలి మంగళవారం సమావేశమై ఓటీటీ రిలీజ్లపైనా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
పరిమిత బడ్జెట్లో తీసిన చిత్రాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని చెప్పింది. అలాగే రూ.6 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించిన సినిమాల ఓటీటీ రిలీజ్ విషయంపై ఫెడరేషన్తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు.
ఓటీటీలో కొత్త సినిమాలు, నటీనటుల పారితోషికాలు, కార్మికుల వేతనాలపై సుమారు గంటపాటు చర్చించిన అనంతరం సినిమా ప్రదర్శన కోసం చెల్లించే వీపీఎఫ్ ఛార్జీలను ఎగ్జిబిటర్లే చెల్లించాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. సామాన్యులకు టికెట్ ధరలను అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. సాధారణ థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 రూపాయలు ఉండేలా ప్రతిపాదనలు ముందు పెట్టింది. మల్టీఫ్లెక్స్లో జీఎస్టీతో కలిపి రూ.125, రూ.150 ఉండేలా ప్రతిపాదనలు చేసింది.
ఫిలిం చాంబర్, నిర్మాతల మండలితో చర్చించాకే సినిమా నిర్మాణ వ్యయాలు పెంచుకోవాలని సూచించింది. ఫిలిం చాంబర్ నిర్ణయించిన రేట్ కార్డ్ నే షూటింగ్ ప్రదేశాల్లో నిర్మాతలు అమలు చేయాలని ఆదేశించింది. నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న మేనేజర్లు, కోఆర్డినేటర్ల వ్యవస్థను తొలగించాలని మండిపడింది.
నిర్ణీత సమయానికల్లా నటీనటులు షూటింగ్స్కు హాజరయ్యేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. నిర్దేశించిన సమయానికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని తెలిపింది. నటీనటుల సహాయకులకు వసతులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే పారితోషకంలో కోత విధించాల్సిందేనని పేర్కొంది.
ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా బంద్ చేయాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానించింది.
More Stories
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు