నెహ్రు, గాంధీల పేరుతో తరాలకు సరిపడా సంపాదించుకున్నాం

నెహ్రు, గాంధీల పేరుతో తరాలకు సరిపడా సంపాదించుకున్నాం

”జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీల పేరుతో మనం 3-4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. ఇప్పుడు అందుకు తగిన ప్రతిఫలం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని భయంగా ఉంది” . ఈ మాటలు అన్నది ఎవ్వరో బిజెపి నేత కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్యెల్యే, మాజీ స్పీకర్ కె. ఆర్‌. రమేష్‌ కుమార్‌. 

ఈ వాఖ్యాలను ఎక్కడో అన్యాపదేశంగా కూడా చేయలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఇడి విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ బెంగళూరులోని ఫ్రీడమ్‌ పార్క్‌లో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలోనే  గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్‌ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వంటి ప్రముఖుల సమక్షంలోనే చేసిన వాఖ్యలో కాంగ్రెస్ వర్గాలలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. రమేశ్‌ కుమార్‌ గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో బహిరంగ క్షమాపణలు చెప్పారు.

ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ కే. ‘కాంగ్రెస్‌ పార్టీ గత 60 ఏళ్లలో ఏ విధంగా దేశాన్ని దోచుకుందనే విషయాన్ని ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు.