దేశంలో కరోనా కేసుల సంఖ్యా క్రమంగా పెరుగుతూ ఉండడం, రోజువారీ కేసులు 20,000 దాటుతూ ఉండడంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కవర్ణా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొన్ని రాష్ట్రాలలో మందకొడిగా సాగుతోందని, ఇది భవిష్యత్ రోజుల్లో చూపబోయే ప్రభావంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలోని 9 రాష్ట్రాల్లోని 115 జిల్లాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోందని అందులో ఏపీ కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లలో నమోదవుతున్న కరోనా కేసుల పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ రాష్ట్రాల్లో రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్యను పెరుగుతున్నట్లు గుర్తించారు. దీనిదృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో కీలకమైన కరోనా నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన వ్యూహాలను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి మిలియన్ జనాభాకు నిర్వహించే సగటు కరోనా పరీక్షలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది.
మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో ఆర్టీ పీసీఆర్ పరీక్షల నిర్వహణ చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్లలో జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని, ఈ రాష్ట్రాలు ఆర్టీ పీసీఆర్ పరీక్షలను మెరుగుపరచాలని సూచించింది.
నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వినోద్ పాల్ గత నెలలో తొమ్మిది రాష్ట్రాల్ల్రో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. అధిక సానుకూలత రేటు ఉన్న ప్రాంతాల్లో కరోనా పరీక్షలను మెరుగుపరచాలని, నిఘా పెంచాలని, టీ-కాను వేగవంతం చేయాలని వారిని కోరారు.
అధికంగా కేసులు నమోదయ్యే అన్ని జిల్లాల్లోనూ ఆర్టీ పీసీఆర్ పరీక్షల సంఖ్యను వెంటనే పెంచాలని కేంద్రం పేర్కొంది. వైరస్ సోకిన వ్యక్తులను ఇతరులతో కలవకుండా, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి హోమ్ ఐసోలేషన్ కేసులను సమర్థవంతంగా , ఖచ్చితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కరోనా నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాలు విధిగా రోజువారీ నివేదికలు సమర్పించాలని కేంద్రం కోరింది. జిల్లాల వారీగా తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం, ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్య కేసులను ప్రతిరోజూ నివేదించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా వచ్చే ప్రయాణీకులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని పరీక్షించి విధిగా ఐసోలేషన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సమాజంలోని పెద్ద సమూహాలు, వాటినుండి వచ్చే వ్యాప్తి, పాజిటివిటీ నమూనాలను పంపమని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అదేక్రమంలో మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని చెప్పింది.
సెప్టెంబర్ 30 వరకు కరోనా వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్ కింద 18 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని కోరింది. ఈ విధంగా ముందు జాగ్రత్త చర్యలను పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించాలని సూచించింది.
More Stories
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా
ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి