కరోనా ఐసొలేషన్ కేసులను పకబ్బందీగా పర్యవేక్షించాలి

కరోనా ఐసొలేషన్ కేసులను అత్యంత పకడ్బందీగా పర్యవేక్షించాలని, దానివల్ల ఆయా రోగులు సమాజంలో మిగతా వారితో సన్నిహితం కాకుండా ఉంటారని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు వైరస్‌ను రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (ఆర్‌టిఎ) ద్వారా గుర్తించడానికి వీలుగా హోమ్ టెస్ట్ కిట్స్‌పై అవగాహన మరింత ముమ్మరం చేయాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

జిల్లాల వారీగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధ అస్వస్థతలు, ఇన్‌ఫ్లుయెంజా వంటి కేసులను రోజూ గుర్తించి నమూనాలను ఇన్సాకాగ్ లేబొరేటరీలకు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల కోసం పంపాలని కేంద్రం సూచించింది. ఇదే విధంగా విదేశాల నుంచి వచ్చేవారిని పరీక్షించి పాజిటివ్ కనిపిస్తే ఆ కేసులనమూనాలను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించింది.

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సా, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ తదితర తొమ్మిది రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితిని సమావేశం సమీక్షించింది. నీతి అయోగ్ కు చెందిన సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వినోద్‌పాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ రాష్ట్రాల్లో గత నెల కొవిడ్ కేసులు పెరగడంపై ఆందోళన వెలిబుచ్చారు. పర్యవేక్షణ, కరోనా పరీక్షలు అంతంత మాత్రంగా ఉండడంతోపాటు సరాసరి వ్యాక్సినేషన్ స్థాయి కన్నా తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతున్నాయని, అందువల్ల పరీక్షలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు.

కొవాగ్జిన్ బూస్టర్ డోస్‌తో అత్యంత రక్షణ

ఇలా ఉండగా, కరోనా వైరస్ వేరియంట్ల నుంచి తట్టుకుని భద్రత కల్పించడంలోను వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం లోను తాము తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ బాస్టర్ డోసు సమర్ధంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో రుజువైందని ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ నిర్వహించిన అధ్యయనాన్ని ఆమోదించి నేచర్ సైంటిఫిక్ రిపోర్టు అనే జర్నల్‌లో ప్రచురించారు. 
 
 మొత్తం 184 అంశాలపై ఈ అధ్యయనం సాగింది. అధ్యయనం లో పాల్గొన్న వారికి మొదట రెండు డోసుల తరువాత ఆరు నెలలకు యాధృచ్ఛికంగా 1:1 నిష్పత్తిలో కొవాగ్జిన్ బూస్టర్ డోసు లేదా ప్రభావం లేని వ్యాక్సిన్‌ను ఇవ్వడమైందని వివరించారు. 
 
ఈ బూస్టర్ డోసు కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా యాంటీబాడీల స్పందనను తటస్ఠీకరించడమే కాకుండా, మెమరీ టి, బి కణాల ద్వారా సుదీర్ఘకాలం రక్షణ కల్పిస్తున్నట్టు తేలిందని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ణ యెల్లా వివరించారు.