`లో దుస్తులు’ తీస్తేనే నీట్ పరీక్ష… విస్తుపోయిన కేరళలో విద్యార్థునులు

కేరళలోని ఓ కళాశాలలో నీట్  పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థునులకు ఘోర అవమానం జరిగింది. `లో దుస్తులు’ తీసేస్తేనే పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చెయ్యడంతో అవమాన భారంతో, మానసిక వేదనతో అదే విధంగా పరీక్ష వ్రాయవలసి వచ్చింది. ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. 

ఈ నిబంధన వల్ల తన కూతురు తీవ్ర మానసిక క్షోభ అనుభవించిందని ఓ విద్యార్థిని తండ్రి గోపకుమార్ సూరానంద్ తెలిపారు. ఈ విషయంపై కొల్లం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు  చేశారు. 

మార్ థోమా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో ఆదివారం నీట్‌ పరీక్ష రాసేందుకు తన కూతురు వెళ్లిందని, బ్రా తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారని గోపకుమార్ ఫిర్యాదు చేశారు. మెటల్ హుక్స్ ఉన్నాయనే కారణంతో లోదుస్తులు తీసేయాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వమని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. దీని వల్ల పరీక్ష రాశాక తన కూతురు ఏడుస్తూ ఇంటికి వచ్చిందని వివరించారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల్లో మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తులు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదని, అయినా వారు దీన్ని అమలు చేయడమేంటని గోపకుమార్‌ ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల ఎంతో మంది విద్యార్థినులు క్షోభ అనుభవిస్తున్నారని, పరీక్ష సరిగ్గా రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.

ఒకవేళ మెటల్‌ హుక్స్‌ బ్రాలు ధరించిన విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిని చెక్‌ చేసిన తర్వాతైనా హాల్‌లోకి  అనుమతించాలని, కానీ లోదుస్తులు తీసిసే పరీక్ష రాయమనడం ఎంతవరకు సబబు అని గోపకుమార్ ప్రశ్నించారు. ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులందరితో లోదుస్తులను బలవంతంగా తొలగించి, కరోనా  నిబంధనలు కూడా పాటించకుండా లోదుస్తులన్నింటినీ ఒకే గదిలో వేయాలని విద్యార్థులకు సిబ్బంది చెప్పినట్లు గోపకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘‘సెక్యూరిటీ చెక్‌లో బీప్ సౌండ్ రావడంతో అది తన లోదుస్తులకు ఉన్న మెటల్ హుక్ అని నా కుమార్తె చెప్పింది. దీంతో దానిని తీసేయాల్సిందేనని వారు బలవంతం చేశారు. దాదాపు 90 శాతం మంది విద్యార్థినులు తమ లోదుస్తులను తొలగించి స్టోర్‌రూములో ఉంచాల్సి వచ్చింది. పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు’’ అని ఆ బాలిక తండ్రి పేర్కొన్నారు.

గది నిండా లోదుస్తులు ఉండడాన్ని తన కుమార్తె చూసిందని, చాలామంది అమ్మాయిలు దుఃఖాన్ని ఆపులేక ఏడ్చేశారని, మానసికంగా చిత్రవధ అనుభవించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, మరికొంతమంది అమ్మాయిలు వారి లోదుస్తులకున్న హుక్స్‌ను కట్ చేసి ముడివేసుకున్నారని, వారు మానసికంగా ఇబ్బంది పడడంతో పరీక్షకు హాజరు కాలేకపోయారని తెలిపారు. 

అయితే, మార్థోమా కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పింది. తాము కేవలం అటెండెన్స్ వివరాలు మాత్రమే చూసుకున్నామని, విద్యార్థులకు లోనికి అనుమతించే బాధ్యతలు నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి వచ్చిన సిబ్బందే చూసుకున్నట్లు తెలిపింది. హిజాబ్ ధరించిన విద్యార్థులు తమను హాల్‌లోకి అనుమతించట్లేదని ఏడిస్తే తాము జోక్యం చేసుకుని లోపలికి పంపించినట్లు కాలేజీ సిబ్బంది వివరించారు.