ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ నామినేష‌న్‌ దాఖలు

ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ నామినేష‌న్‌ దాఖలు

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ను ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన సోమవారం పార్ల‌మెంట్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. జ‌గ‌దీప్ నామినేష‌న్ ప‌త్రంపై ప్ర‌ధాని నరేంద్ర మోదీ సంత‌కం చేశారు.  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వారి వెంట ఉన్నారు.

1951 మే 18న రాజస్థాన్‌లోని జుంజును జిల్లా కిథానా గ్రామంలో జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ జన్మించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, రాజస్థాన్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం విద్యనభ్యసించారు. 1979లో రాజస్థాన్‌ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా నమోదు చేసుకున్నారు. చాలా ఏండ్ల పాటు రాజస్థాన్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్నారు.

జులై 19తో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల  ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్‌ అల్వా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్టు 6న జరగనుండగా, అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి.

ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగం

ఇలా ఉండగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్లో మీడియాతో మాట్లాడుతూ ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగమని చెప్పారు. దేశంలో కొత్తశక్తిని పెంపొందించేందుకు.. పార్లమెంటు సభ్యులు మాద్యమంగా మారాలని పిలుపిచ్చారు. 
 
రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయమని, కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని అందించబోతోందని పెర్కున్నారు. ఈ సెషన్‌ను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామని సూచించారు. పార్లమెంటులో చర్చలు జరగాలని.. విషయాలను లోతుగా విశ్లేషించాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధానమంత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు.