గతంలో ముస్లిం సమాజాన్ని రాజకీయంగా దోచుకున్నారు

గతంలో ముస్లిం సమాజాన్ని రాజకీయంగా దోచుకున్నారని, ఉద్దేశపూర్వకంగా రాజకీయ సాధికారతకు దూరం చేశారని  భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ  విమర్శించారు. అయితే, ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి కృషి’ అనేది బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానం, ఉద్దేశం అని స్పష్టం చేశారు.

రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పార్టీ నుంచి ఎటువంటి హామీ ఈ సందర్భంగా లభించలేదని చెప్పారు. గతంలో మాదిరిగా తమ ప్రభుత్వం బుజ్జగింపులకు పాల్పడటం లేదని, ఎవరిపైన అయినా వివక్ష చూపించినట్లు ఎవరూ ఆరోపించలేరని ఆయన గుర్తు చేశారు.

గతంలో ముస్లిం సమాజాన్ని రాజకీయంగా దోచుకున్నారని, ఉద్దేశపూర్వకంగా రాజకీయ సాధికారతకు దూరం చేశారని ఆయన ఆరోపించారు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 3.31 కోట్ల మందికి గృహ నిర్మాణ పథకం క్రింద ఇళ్లను ఇచ్చారని, వీటిలో 31 శాతం ఇళ్ళను మైనారిటీలకు ఇచ్చారని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధిలో మైనారిటీల వాటా 35 శాతమని తెలిపారు.

ముద్రా యోజనలో 35 శాతం వాటాను మైనారిటీలు పొందారని పేర్కొన్నారు. తాము అభివృద్ధిలో వివక్ష చూపనపుడు, తమకు ఓటు వేయడంలో ఏ సమాజమైనా ఎందుకు వివక్ష చూపించాలని ఆయన ప్రశ్నించారు.  గతంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే కేవలం ముస్లింల మంత్రిత్వ శాఖగా ఉండేదని గుర్తు చేశారు.

కానీ, ప్రస్తుతం ముస్లింలతో పాటు క్రైస్తవులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, సిక్కులను కూడా కలుపుకుని పోతున్నట్లు తెలిపారు. తన మంత్రిత్వ శాఖ చాలా హుందాగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. బీజేపీలో సుప్రసిద్ధ ముస్లిం నేత నఖ్వీ  17 ఏళ్ల వయసు నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు.

దాదాపు 47 ఏళ్ళ నుంచి  ఆయన రాజకీయాల్లో సేవలందిస్తున్నారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. దేశ జనాభాలో ముస్లింలు 16 శాతం మంది ఉన్నారని, మోదీ మంత్రివర్గం నుంచి నఖ్వీ నిష్క్రమణ తర్వాత, ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని కొందరు ఆరోపిస్తుండటంపై ఆయన స్పందిస్తూ, తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు, కేవలం ముస్లింలను మాత్రమే అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేయలేదని స్పష్టం చేశారు.

సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని అందరు మంత్రులు రాజ్యాంగబద్ధంగా ప్రతిజ్ఞ చేశారని చెప్పారు. దేశంలోని అతి పెద్ద మైనారిటీ వర్గానికి రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయని కొందరు అంటుండటంపై మాట్లాడుతూ, ఎవరైనా ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాలేకపోతే, ఉగ్రవాది అయిపోడని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచనలు అభివృద్ధి మార్గం నుంచి ఓ వర్గాన్ని వేరు చేసే ప్రయత్నమేనని హెచ్చరించారు.

మెజారిటీ ముస్లిం ఓట్లను పొందే పార్టీలు మైనారిటీలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లింలకు బీజేపీ అవకాశం ఇవ్వడం లేదనే విమర్శలపై స్పందిస్తూ, తాను బీజేపీ టిక్కెట్‌పై ఐదుసార్లు పోటీ చేశానని, నాలుగుసార్లు ఓడిపోయానని చెప్పారు.

తాను బీజేపీలో వివిధ స్థాయుల్లో పని చేశానని, పార్లమెంటు చెబుతూ శాసనసభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దాదాపు 350 మంది ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో పరాజయం పొందిన ముస్లింలకు లెజిస్లేచర్ ద్వారా ప్రాతినిధ్యం కల్పించేందుకు బీజేపీ  ప్రయత్నిస్తోందని చెప్పారు.