మహారాష్ట్ర సీఎంగా  షిండే, డిప్యూటీగా ఫడ్నవిస్ 

కొద్ది రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెర దించుతూ  గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ సమక్షంలో  రాజ్‌భవన్‌లో రాష్ట్రంలో 20వ ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. 
 
దీంతో ఇకపై మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం పాలన సాగించనుంది.  తాను ప్రభుత్వంలో చేరబోవడం లేదని ఫడ్నవిస్ మొదట ప్రకటించినా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ఆదేశంతో ఉపముఖ్యమంత్రిగా చేరారు.  రాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌ అవుతారకున్న షిండే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కింగ్‌ అయ్యారు.
రాష్ట్ర అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని, రాష్ట్రంలో అన్ని వర్గాలను తనతోపాటు కలుపుకొని ముందుకెళ్తానని షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పట్ల ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.
సీఎంగా తన నియామకం బాల్‌ ఠాక్రే సిద్ధాంతానికి, తన గురువు ‘ధర్మవీర్‌’ఆనంద్‌ డిఘే బోధనలకు లభించిన విజయమని వెల్లడించారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కొందరు శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు ఫడ్నవీస్‌ వెల్లడించారు.
 రెబల్‌ ఎమ్మెల్యేలు ఒక శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రిగా చేయగలరా? అంటూ తాజా మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విసిరిన సవాలుగా జవాబుగా ముఖ్యమంత్రి పదవిని బీజేపీ వదులుకున్నట్లు తెలుస్తోంది.
అధికారం కోసం పోరాటం కాదు 
ఇది అధికారం కోసం జరిగిన పోరాటం కాదని ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంపై ఎన్నికలను రుద్దడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 2019 నాటి ప్రజాతీర్పును ఉద్ధవ్‌ ఠాక్రే–కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి అపహాస్యం చేసిందని విమర్శించారు.  బాలాసాహెబ్‌ బాల్‌ ఠాక్రే జీవితాంతం వ్యతిరేకించిన పార్టీలతో ఉద్ధవ్‌ నిస్సిగ్గుగా చేతులు కలిపారని మండిపడ్డారు. మహా వికాస్‌ అఘాడీ(ఏంవీఏ) సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు.
మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్‌ షిండేకు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు అభినందనలు తెలియజేశారు.
 
ఈ నెల 2–3న అసెంబ్లీ భేటీ 
కాగా, జూలై 2, 3 తేదీల్లో మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఆధ్వర్యంలో తొలి మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.
 
1980లో శివసేన మాజీ అధ్యక్షుడు ఆనంద్ డిగే ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏక్‌నాథ్ షిండే ప్రవేశించారు. కొప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గం నుంచి షిండే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 
1964 ఫిబ్రవరి 9న ఏక్‌నాథ్‌ షిండే జన్మించారు. యశ్వంతరావు వాన్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో శివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చపాఖాది నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 
 
తర్వాత వరసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలుస్తూ వచ్చారు.  2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2019 నవంబర్‌ 28 నుంచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.