ప్రధాని మోదీ సమక్షంలో బిజెపిలోకి విశ్వేశ్వర్ రెడ్డి 

భారతీయ జనతా పార్టీలో చేరతారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టత ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ నెల 2న  చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసముందని ఈ సందర్భంగా చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమని, అందుకే తాను బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఎదుర్కొనే పరిస్థితులలో లేదని పేర్కొన్నారు.  ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందనుకుంటే.. అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 75 శాతం ప్రజలు సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకంగా ఉన్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని అంటూ తాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని, అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. సకాలంలో రేవంత్ కు పీసీసీ పదవి ఇచ్చుంటే తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవాడినని  విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి శూన్యమని కొండా విశ్వేశ్వరరెడ్డి చెబుతూ  తెలంగాణను వ్యతిరేకించిన పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా హుజూరాబాద్ ఫలితాలే వస్తాయని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ పూర్తి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తాను పదవులు ఆశించి బీజేపీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తాను ఎంపీ పదవికే సరిపోతానని.. తనకు అదే ఆసక్తి వెల్లడించారు. అయితే, ఎమ్మెల్యేగా పోటీచేయమని అధిష్ఠానం చెబితే చేస్తానని తెలిపారు.
2014లో  టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందిన ఆయన ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై, 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.  టీఆర్ఎస్ ను ఓడించగల పార్టీలో చేరతానని చెబుతూ వస్తున్నారు.