ఎంపీ రఘురామపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందున రఘురామపై సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. సీఐడీ కేసు కొట్టేయాలన్న రఘురామ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. రఘురామకృష్ణంరాజు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 
 
అయితే, రఘురామరాజును రాజద్రోహం నేరం మినహా మిగతా సెక్షన్‌ల కింద విచారించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో లాయర్‌ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని ఆదేశించింది. 
 
కేసుకు సంబంధించిన అంశాలు మినహా ఏ ఇతర అంశాలపై పిటిషనర్‌ను ప్రశ్నించకూడదని హైకోర్టు పేర్కొంది. అలాగే సీఐడీ కార్యాలయాలకు పిలిపించవద్దని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అంతా లాయర్‌ సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే బాధ్యులైన పోలీస్‌ అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు పేర్కొంది.