ధర్మవరంలో బిజెపి నేతలపై వైసిపి ఎమ్యెల్యే హత్యాయత్నం!

ధర్మవరం ప్రెస్‌‌క్లబ్‌లో బీజేపీపై నేతలపై పట్టపగలు పాత్రికేయుల సమావేశంలో ఉండగా మారణాయుధాలతో వచ్చి హత్యకు ప్రయత్నం చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి స్థానిక వైసిపి ఎమ్మెల్యే కారణం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ విషయమై డీఐజీ, ఎస్పీలతో ఘటనపై మాట్లాడినట్లు ఆయన చెప్పారు.
దాడి చేస్తానని ఎమ్మెల్యే ముందుగా ప్రకటించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు అంశంగా తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తరహా సంఘటనలను ప్రభుత్వం నిలువరించకపోతే బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని సోమువీర్రాజు హెచ్చరించారు.
ధర్మవరం ప్రెస్ క్లబ్‌లో బీజేపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కట్టెలు, రాడ్లు చేతిలో పట్టుకుని స్కోర్పియో వాహనాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరులు వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారం బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. దాడిని పక్కదోవ పట్టించడంలో భాగంగా ఎల్లో కలర్ షర్ట్స్ వేసుకుని వైసీపీ గ్యాంగ్ రావడం గమనార్హం.
అయితే బీజేపీ నేతలు దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ముఖ్య అనుచరుడు గొట్లూరు మారుతీ మనుషులుగా చెబుతున్నారు. ఐదు నిమిషాల్లో దొరికిన వారిని దొరికినట్లు వైసీపీ గ్యాంగ్ చితక్కొట్టింది. రోడ్డుపై ఉన్న బీజేపీ నేతలపై వెంటపడి రాడ్లతో దాడికి పాల్పడ్డారు.
కాగా వైసీపీ ప్లీనరీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దానితో, వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డారు.