అగ్నిపథ్ నిరసనలపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

అగ్నిపథ్ పథకంపై ఉద్రిక్తతలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం శనివారంనాడు అప్రమత్తం చేసింది. పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నోట్ పంపింది.
కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ అర్చనా వర్మ సంతకం చేసిన లేఖలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, అడ్మినిస్ట్రేటర్ అడ్వైజర్లకు పంపింది.
“అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు ప్రధానంగా పలువురు ఒకచోట గుమిగూడటం, ధర్మాలు, ప్రదర్శనలు, మార్చ్‌లు, లూటీలు, ప్రజా ఆస్తుల విధ్వంసం రూపంలో ఉంటాయి. భారత్ బంద్, ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద  ఈనెల 20న నిరసలకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సర్క్యులేషన్‌లో ఉంది. ఇదే తరహా నిరసనలు కొద్దికాలం పాటు ఉండే అవకాశాలున్నాయి” అని ఆ లేఖలో అర్చనా వర్మ పేర్కొన్నారు.
ఈ తరహా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీలకమైన ప్రాంతాలు, ముఖ్యంగా రైల్వే స్టేషన్లు/లైన్లు, జాతీయ రహదారులు, కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం అనివార్యమని, తద్వారా శాంతిభద్రతలు, ప్రశాంతతకు ఎలాంటి అవాంతరాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆ నోట్ సూచించింది.
 కాగా, అగ్నిపథ్ నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి నిరసనకారులు రైల్వే స్టేషన్లు, లైన్లను టార్గెట్ చేసుకోవడంతో నష్టం కూడా భారీగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

369 రైళ్లు రద్దు

‘అగ్నిపథ్’పై ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా శనివారం నాడు 369 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో 201 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగా, 159 లోకల్ ప్యాసింజర్ రైళ్లుగా తెలిపింది. వీటితో పాటు మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేయడంతో శనివారం నాడు మొత్తం రద్దయిన రైళ్ల సంఖ్య 371కి చేరింది.
శుక్రవారం నాడు కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. యువత విధ్వంసానికి దిగడం దేశవ్యాప్తంగా 340 రైళ్లను ప్రభావితం చేసింది. 234 రైళ్లను అధికారులు రద్దుచేశారు. వీటిలో 94 మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 140 ప్యాసింజర్‌ రైళ్లు. మరో 95 రైళ్లను పాక్షికంగా రద్దుచేశారు. ఇంకో 11 రైళ్లను దారి మళ్లించారు.
బిహార్‌, జార్ఖండ్‌, యూపీలోని కొన్ని ప్రాంతాల పరిధిలోని ఒక్క ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే జోన్‌లోనే 164 రైళ్లు రద్దయ్యాయి. బిహార్‌, తూర్పు యూపీలకు వెళ్లే సర్వీసులను కొన్ని ప్రాంతాల వరకే నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించొద్దని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ యువతకు పిలుపిచ్చారు.