జులై 1 నుంచి ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం

ఒకసారి వాడిపారేసే 16 రకాల ప్లాస్టిక్‌ వస్తువులను జులై 1 నుంచి నిషేధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది.  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది.  పెట్రోకెమికల్‌ సంస్థలేవీ ప్లాస్టిక్‌ ముడిసరకును ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
వాణిజ్య సంస్థలు కూడా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉపయోగించరాదని షరతు విధిస్తూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీ చేయాలని, ఒకవేళ ఎవరైనా ఉపయోగించినా, లేదంటే నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించినా వాటి లైసెన్సులు రద్దుచేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
 ఇయర్‌బడ్స్‌, బుడగలు, క్యాండీ, ఐస్‌క్రీంల కోసం వాడే ప్లాస్టిక్‌ పుల్లలు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్‌ స్వీట్‌బాక్సులు, ఆహ్వానపత్రాలు, సిగరెట్‌ ప్యాకెట్లు, 100 మైక్రాన్‌లలోపు ఉండే పివిసి బ్యానర్లు, అలంకరణ కోసం వాడే పాలిస్ట్రైరిన్‌ (థర్మోకోల్‌) వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది.