8 ఏళ్ళల్లో 8 రేట్లు వృద్ధి చెందిన జీవ ఆర్ధిక వ్యవస్థ 

తన ఎనిమిదేళ్ల పాలనలో భారత దేశ జీవ ఆర్ధిక వ్యవస్థ ఎనిమిది రేట్లు వృద్ధి చెందిన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.  దేశాభివృద్ధికి ఊతమివ్వడానికి ప్రతి రంగాన్ని పటిష్టపరచాలని తన ప్రభుత్వం నమ్ముతోందని ఆయన స్పష్టం చేశారు.
 కొన్ని రంగాలపై మాత్రమే దృష్టి పెట్టి, మరికొన్ని రంగాలను నిర్లక్ష్యం చేసే పాత ధోరణిని మార్చామని చెప్పారు. రెండు రోజులపాటు జరిగే బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పోను ప్రారంభించిన అనంతరం ఆయన గురువారం మాట్లాడారు.
భారత దేశ బయో ఎకానమీ గడచిన ఎనిమిదేళ్ళలో ఎనిమిది రెట్లు వృద్ధి చెందిందని ప్రధాని  తెలిపారు. 10 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. ప్రపంచ బయోటెక్ ఎకోసిస్టమ్‌ లో అగ్ర స్థానంలోని 10 దేశాల్లో ఒకటిగా భారత దేశంఎదిగే రోజులు ఎంతో దూరంలో లేవని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
ఎనిమిదేళ్ళ క్రితం కొన్ని వందల సంఖ్యలో ఉన్న స్టార్టప్ కంపెనీలు, ప్రస్తుతం 70,000కు చేరాయని పేర్కొన్నారు. వ్యాపారాన్ని సులువుగా చేయడంను బలోపేతం చేయడం కోసం తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను ఏర్పాటు చేసే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నట్లు మోదీ తెలిపారు.
 దాదాపు 60 వేర్వేరు పరిశ్రమల్లో 70,000 స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రంగం వైపునకు ప్రతిభావంతులు వస్తున్నారని తెలిపారు. బయోటెక్ సెక్టర్‌లో పెట్టుబడిదారుల సంఖ్య తొమ్మిది రెట్లు పెరిగిందని, బయోటెక్ ఇంక్యుబేటర్స్, వాటికి ఫండింగ్ చేసేవారు ఏడు రెట్లు పెరిగారని చెప్పారు.
బయోటెక్ ఇంక్యుబేటర్స్ 2014లో ఆరు ఉండేవని, ఇప్పుడు ఇవి 75కు పెరిగాయని చెప్పారు. బయోటెక్ ఉత్పత్తులు 10 నుంచి 700కు పెరిగాయన్నారు. కొన్ని రంగాల నుంచి ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని ప్రధాని పేర్కొన్నారు. భారత దేశ అభివృద్ధికి ఊతమివ్వడానికి ప్రతి సాధనాన్ని అన్వేషిస్తున్నామని తెలిపారు.
దేశాభివృద్ధికి ఊతమివ్వడానికి బయోటెక్ సెక్టర్ చాలా ముఖ్యమైనదని ప్రధాని చెప్పారు. మన దేశ ఐటీ ప్రొఫెషనల్స్ నైపుణ్యం, ఇన్నోవేషన్లకు ప్రపంచవ్యాప్తంగా నమ్మకం నూతన శిఖరాలకు చేరిందని తెలిపారు. అటువంటి నమ్మకం, కీర్తి, ప్రతిష్ఠలు ఈ దశాబ్దంలో భారత దేశ బయోటెక్ సెక్టర్‌, బయో ప్రొఫెషనల్స్  విషయంలో వస్తున్నాయని వివరించారు.