కష్టపడి పనిచేస్తే తెలంగాణాలో అధికారం మనదే 

రాబోయే ఎన్నికల కోసం తెలంగాణలో కష్టపడి పని చేస్తే అధికారం మనదే (బీజేపీ) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో హైదరాబాద్‌ బీజేపీ కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. మంగళవారం సాయంత్రం సుమారు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది.

ఒక్కో కార్పొరేటర్‌ను పేరు పేరునా పరిచయం చేసుకున్న ప్రధాని  వాళ్ల కుటుంబ పరిస్థితి, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలవలేకపోయానని చెబుతూ  ఈసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కలుసుకుందాం అంటూ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మరింత ఉత్సాహంతో దూసుకెళ్లాలని, ప్రజా ప్రతినిధులుగా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల్లోనే ఉండాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. బూత్‌ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టే ఏ కార్యక్రమాలకైనా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని, దీనిపై అందరూ దృష్టి పెట్టాలని చెప్పారు.

ప్రజాజీవితంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచు కొని కార్యాచరణ రూపొందించుకోవాలని ప్రధాని సూచించారు. కార్పొరేటర్లు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రజలకు దగ్గరయ్యేలా పని చేయాలని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని, అప్పుడే పార్టీ బలోపేతం సాధ్యమని చెప్పారు. ముఖ్యంగా గత ఎనిమిదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చేపట్టాలి్సన అభివృద్ధి కార్యక్రమాలపై మార్గనిర్దేశం చేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రధాని నివాసంలో సాయంత్రం ఆరు గంటలకు మోదీతో సమావేశమయ్యారు. తెలంగాణలో సుపరిపాలన దిశగా, వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ కృషి చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో భేటీ అనంతరం మోదీ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై కార్పొరేటర్లతో విస్తృత చర్చలు జరిపామని తెలిపారు.

 ప్రధానితో భేటీ అయిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు తదితరులున్నారు. 

తొలుత సంతోష్ తో భేటీ 

మోదీతో భేటీకి ముందు కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌లతో భేటీ అయ్యారు. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసే అంశంపై సంతోష్‌ పలు సూచనలు చేశారు. దక్షిణ భారత్‌లో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, కుటుంబ వారసత్వ రాజకీయాలు, ప్రభుత్వ అవినీతి, కాంగ్రెస్‌ వైఫల్యాలు వంటి అంశాలు బీజేపీ అనుకూలంగా మారాయని పేర్కొన్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకత్వానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచనతోనే జైపూర్‌లో జరగాల్సిన జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌కు మార్చామని కార్పొరేటర్లతో చెప్పిన్నట్లుగా తెలిసింది. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ సైతం పార్టీ అధికారంలోకి వచ్చే విషయమై కార్పొరేటర్లకు పలు సూచనలు చేశారు.